టిక్ టాక్.. ఈ మధ్య కాలంలో ఇంతగా వివాదాస్పదం అయిన యాప్ ఇంకొకటి లేదేమో.. సామాన్యుడు కూడా తానో హీరోగా కనిపించే అవకాశం ఉండటంతో ఈ యాప్ అంటే స్మార్ట్ ఫోన్ ఉన్నవారు పడిచస్తున్నారు. ప్రత్యేకించి యూత్ , పిల్లలు టిక్ టాక్ కోసం ఏదైనా చేసే రేంజ్ కు వెళ్లిపోతున్నారు.
ఇటీవల టిక్ టాక్ మరణాలు వార్తలు చాలానే వచ్చినా.. ఇంకా చాలామందిటిక్ టిక్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా టిక్ టాక్ మరొకరి ప్రాణం తీసింది.
ఇద్దరు అన్నదమ్ములు సరదా కోసం చేసిన ప్రయత్నం వారి కుటుంబంలో విషాదం నింపింది . ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని ఓ చెరువులో జరిగింది. సంగారెడ్డి జిల్లాకి చెందిన యువకుడు నర్సింహులు, అతనికి వరుసకు సోదరుడైన ప్రశాంత్.. ఇద్దరూ కలిసి దూలపల్లి దుమార్ చెరువులో దిగారు.
ఫోన్ టిక్ టాక్ యాప్ను అనుసరిస్తూ నర్సింహులు చెరువులోకి దిగాడు. చెరువుగట్టుపై నుంచి ప్రశాంత్ వీడియో చిత్రీకరిస్తూ ఉండగా… ఈత రాక నర్సింహులు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో భయపడిన ప్రశాంత్.. స్థానికులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు.