అటు పాదయాత్ర సమయంలోను, ఇటు ఎన్నికల సమయంలోనూ వైసీపీ అధినేతగా, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్.. ప్రజలపై వరాల వర్షం కురిపించారు. అన్ని వర్గాలపైనా ఆర్థిక భరోసాను వర్షించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని ఇచ్చిన హామీని అప్పట్లో విపక్షాలు సహా ప్రభుత్వ అను కూల మీడియా కూడా అవహేళన చేసింది. ఉచితాలతో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని, జగన్ ప్రకటించిన వరాలు తీర్చేందుకు కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. కేవలం అధికారమే పరమావధిగా జగన్ వరాలు ప్రకటించారు తప్పితే.. ఆయనచేసిది ఏమీలేదని అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు, ఆయన టీం కూడా విమర్శల జడివాన బాగానే కురిపించారు.
అయినప్పటికీ..ప్రజలు జగన్ వెంటే నిలిచారు. అప్రతిహత మెజారిటీతో ఆయనకు అధికార పగ్గాలు అప్పగించారు. దీంతో ఏపీలో జగన్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నేటికి సరిగ్గా 42 రోజుల కిందట జగన్ ఏపీ సీఎంగా మే30న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఆయన సంక్షేమం దిశగానే అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు(మేనిఫెస్టో) అమలు దిశగా వడివడిగా ముందుకు సాగుతున్నారు.
విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది. అయినప్పటికీ.. తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పథకాలను అమలు చేసి తీరుతానని ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. సాధారణంగా.. రాజకీయాల్లో ఉన్న నాయకులు మాటలు చెప్పడానికి, చేతల్లోకి వచ్చేసరికి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక, అత్యంత లోటు బడ్జెట్లో, ముఖ్యంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పిన స్థాయిలో ఉన్నప్పటికీ.. జగన్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు.
తాజాగా జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2019-20 వార్షిక బడ్జెట్లో అన్ని వర్గాలను సమతుల్యం చేస్తూ..కేటాయింపులు జరిపారు. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన తన తండ్రి వైఎస్ అడుగు జాడల్లో నడిచిన జగన్.. రైతులపై వరాల వర్షం కురిపించారు. వైఎస్సార్ రైతు భరోసాకు 8 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని కేటాయించారు. విత్తనాలకు రూ.200 కోట్లను కేటాయించారు. సాగు నీటికి 4 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. ఇక, అదేసమయంలో పింఛన్లు, అసంఘటిత కార్మిక రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలోను జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆటో ట్యాక్సీ కార్మికులకు రూ.400 కోట్లను కేటాయించారు. (ఇది గతంలో లేదు), అదేవిధంగా ఆరోగ్య శ్రీకి ఊపిరులు ఊదారు. ఇక, పాడేరు, అరకు ప్రాంతాల్లో ఎక్కడ బాగుంటే అక్కడ గిరిజన వైద్య విద్యాలయం నిర్మించడం ద్వారా అనారోగ్యంతో ఏ ఒక్క గిరిజనుడు మృతి చెందరాదనే తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు.కాపులకు రూ.2 వేల కోట్లు కేటాయించడం ద్వారా, కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.300 కోట్లు కేటాయించడం ద్వారా అన్ని వర్గాలను ఆకట్టుకుని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి సంక్షేమానికి తన ప్రభుత్వం పాటు పడుతుందని పేర్కొన్నారు.