నిత్య జీవితంలో రోజులో కనీసం ఒకసారైనా టీ తాగకుండా ఎవరూ ఉండరు. అంతలా టీ మన జీవితంతో చేరిపోయింది. టీ తాగటంలో కూడా మన దేశం ప్రపంచం మొత్తంలో రెండో స్థానంలో ఉంది. నీళ్ల తర్వాత అత్యధికంగా తాగే రెండో పానీయం తేనీరే!
టీ కి 3 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ తేయాకు పండించేది, ఎగుమతి చేసేది మన దేశమే. తేయాకుకు ఇంత ఘన చరిత్ర ఉన్నప్పుడు మనమెందుకు టీ ని కొత్త రూపంలో పరిచయం చేయకూడదు?
ఎన్నో రకాల తేయాకులు...మరి వాటిలో దేంతో చక్కని, చిక్కని టీ తయారు చేయొచ్చు? కమ్మని రుచి కోసం ఏ తేయాకు బాగుంటుంది..? తదితర అంశాలు రీసెర్చ్ చేశారు సింగపూర్కి చెందిన టీడబ్ల్యూజీ అనే సంస్థ వారు. తేయాకు పండే ప్రాంతం, ఆ ప్రాంతం ఎత్తు, వాలు, నేల స్వభావం, వాతావరణాల మీద తేయాకు రుచి ఆధారపడి ఉంటుంది.
ఒక ప్రాంతంలో పండే తేయాకు అయినా కాలం మారితే రుచి మారుతుంది. ఈ విషయాలన్నిటి మీద అవగాహన ఏర్పరుకుని తేయాకుతో వెరైటీలు చేస్తున్నారు. ఇప్పటికే, బ్లాక్ టీ, వైట్ టీ, గ్రీన్ టీ, పుదీనా టీ, అల్లం టీ, మసాలా టీ అందరికీ తెలిసిందే. ఇపుడు హైదరాబాద్ నగరవాసులుకు వినూత్న ఛాయ్ రుచులు పరిచయం కాబోతున్నాయి.
టీడబ్ల్యూజీ సంస్థ దేశంలోనే తొలిసారిగా, బంజారాహిల్స్లో 'ది టీ రూమ్'ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 700 రకాల టీలను ఆస్వాదించవచ్చు.
దోస్తులతో కలిసి టీ తాగి, అవపరమైతే, భోజనం కూడా చేసి రావచ్చు. రూ.500 నుంచి రూ.6,000 వరకు విలువ గల ఛాయ్ ఇక్కడ రుచి చూడవచ్చు అని నిర్వాహకులు అంటున్నారు.