ఫేస్ బుక్ ద్వారా ఎప్పుడో దూరమైన స్నేహితులు, కన్నవారు కలిసిన సంఘటనలు ఉన్నాయి..ఫేస్ బుక్ ల ద్వారా పరిచయాలు ఏర్పడి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు..మోసాలు చేసిన వారు ఉన్నారు. గత కొంత కాలంగా ఫేస్ బుక్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తమ కస్టమర్ల పర్సనల్ డేటాను లీక్ చేసిందన్న ఆరోపణలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై భారీ జరిమానా విధించేందుకు అమెరికా నియంత్రణ సంస్థలు సిద్ధపడ్డాయి. తాజాగా 'వాల్ స్ట్రీట్ జర్నల్'లో ప్రచురితమైన కథనం ప్రకారం, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) సెటిల్ మెంట్ లో భాగంగా ఫేస్ బుక్ పై రూ. 34,280 కోట్ల (5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించనుంది.
అయితే ఇప్పటి వరకు ఈ రేంజ్ లో భారీ జరిమాన విధించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కాగా, వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు సంబంధించి ఓ సంస్థపై ఎఫ్టీసీ ఇంత భారీ జరిమానాను విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, ఈ జరిమానాను అమెరికా న్యాయశాఖ ఆమోదించాల్సివుంది. వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్ బుక్ కు కొన్ని కఠిన ఆంక్షలను కూడా ఎఫ్టీసీ విధించనున్నట్టు సమాచారం.