నిన్నటి ఓటమే రేపటి గెలుపుకు నాంది అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి కృష్ణ దాస్ అన్నారు. నగరంలో ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సీనియర్స్ కేటగిరిలో పురుషులు ,మహిళా విభాగంలో జరుగుతున్న ఈ పోటీలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. క్రీడలు శారీరక , మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
తమ ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మంత్రి కృష్ణ దాస్ తెలిపారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆయన అన్నారు. గడిచిన ఐదేల్లలో తెదేపా ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. జిల్లా కేంద్రం కేఆర్ స్టేడియంను ఆధునీకరిస్తామని చెప్పి , వాటి సంబంధిత పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ పనులను వేగవంతం చేసేందుకు సిబ్బందిని నియమిస్తునట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలను జిల్లా కేంద్రంలో నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని , పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా అధ్యక్షులు , ప్రసూతి వైద్యులు దానేటి శ్రీధర్ తెలిపారు. తొలుత పోటీల ప్రారంభంలో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి అతిధులు గౌరవ వందనం స్వీకరించారు. ఆయా జిల్లాల పేర్లను సూచిస్తూ, ప్లాకార్డు చూపిస్తూ మార్చ్ సాఫ్ట్ చేసారు. ఈ గౌరవ వందనం క్రీడలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం క్రీడా జ్యోతిని రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు వెలిగించి , మంత్రికి అందించారు.