ఇండోనేషియాలో ఆదివారం మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదైంది. ఉత్తర మలుకు దీవిలోని తెర్నాతె అనే నగరానికి నైరుతి దిక్కున 165 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. టెర్నాటే నగరం సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.


టెర్నాటే నగరానికి ఆగ్నేయదిశగా 10 కిలోమీటర్లు లోతున భూకంపం ఏర్పడినట్టు నిపుణులు పేర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సాయత్రం 6.30 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపుకు లోనవటంతో స్థానికుంలందరూ భయాందోళనలకు లోనై రోడ్ల మీదకు పరిగెత్తుకొచ్చారు.  అమెరికా భూబౌతిక శాస్త్రవేత్తలు ఇండోనేషియాలో సంభవించిన భూకంపం అతి శక్తివంతమైందిగా గుర్తించారు.  రింగ్ ఆఫ్ ఫైర్ గా పేర్కొనే ప్రమాదకర జోన్ లో ఇండోనేషియా దీవులు కూడా ఉన్నాయి. ఇక్కడ తరచుగా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు తమ ప్రభావం చూపిస్తుంటాయి.


కాగా, తాజా భూకంపం నేపథ్యంలో నష్టం తాలూకు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలపైనా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే 2018 జూలై, ఆగష్టు మాసాల్లో వరుసగా ఇండోనేషియాలో సంభవించిన భూకంపాల వల్ల 500 మంది మృత్యువాతపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: