ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష టిడిపికి వరుస పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉండేందుకు ఆ పార్టీ నేతలు ఎవరు ఇష్టపడటం లేదు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబు ఫోన్ కాల్ స్పందించడం లేదని వార్తలు వస్తుంటే... ఓడిపోయిన వారైతే ఐదేళ్లపాటు పార్టీని నియోజకవర్గాల్లో పార్టీని సాకలేం అని డిసైడ్ అయ్యి వారి వ్యక్తిగత పనులతో పాటు వ్యాపార పనుల్లో బిజీ అయి పోతున్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు... మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే బిజెపిలో చేరారు.
ఈ క్రమంలోనే రాజధాని జిల్లా అయిన గుంటూరులో ఆ పార్టీకి అదిరిపోయే షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీలో చేరాక రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు టిడిపి బిజెపిలో చేరిపోయారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శివరాజ్సింగ్ చౌహాన్ సమక్షంలో వీరంతా కాషాయ కండువాలు కప్పుకున్నారు.
టీడీపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వర్రావు, మాజీ మంత్రి పట్నం సుబ్బయ్యతో పాటు వెంకట కోటయ్య, సుధాకర్బాబు పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో చందు సాంబశివరావు పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నారు. గతంలో ఓ సారి దుగ్గిరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక సిద్ధా వెంకటేశ్వరరావు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకు సోదరుడు.
ఇక పీలేరుకు చెందిన పట్నం సుబ్బయ్య గతంలో టీడీపీలో మంత్రిగా కూడా పనిచేశారు. వీరితో పాటు పెద్దకూరపాడు, మాచర్ల నియోజకవర్గాలకు చెందిన నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బిగ్ షాకే అనుకోవాలి.