తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఊహించిన షాకే త‌గిలింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అనుకున్న‌ట్లుగానే...టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపిస్తూ.. ఇటీవలే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి, ఆర్టీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయ‌న‌తో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. గోదావరిఖనిలోని సోమారపు ఇంట్లో నేతలు సమావేశం అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ పరిణామాలపై సత్యనారాయణతో చర్చించిన బీజేపీ ఎంపీలు.. ఆయన్ను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు.


కాగా, టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ కలిసి సోమారపు సత్యనారయణను కలిసి పార్టీలోకి ఆహ్వానించగా తర్వాత అంతా కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి.. సోమారపును పార్టీలో చేర్చుకున్నారు. సోమారపు అనుచరులు కూడా బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ మీడియాతో మాట్లాడుతూ,  “టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరబోతున్నారు. టీఆర్ఎస్ లో సొంత పార్టీ వారినే ఓడించే స్థాయికి నాయకులు దిగజారారు. ముఖ్యమంత్రిని మంత్రులు,ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు. ప్రజల సమస్యలను అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి అహంకార ధోరణితో వ్యవహరిస్తూ.. తన చుట్టూ ఉన్నవారికి పట్టం కట్టాడు. అందుకే.. నాయకులు, కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తున్నారు” అని ఎంపీలు అన్నారు. రాష్ట్రంలో పోలీసులతో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారనీ ఆరోపించిన బీజేపీ ఎంపీలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ నాయకులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: