భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలోకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఇవి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సంభవిస్తాయి. అయితే, ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు గ్రహణాలు ఏర్పడవు.
జులై 16న ఏర్పడే చంద్ర గ్రహాణం దేశంలో కనువిందు చేయనుంది. ఈ చంద్రగ్రహణాన్ని ప్రజలందరూ వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఎక్కడ నుంచైనా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు.


ఈ ఏడాదిలో ఏర్పడే రెండో, చివరి చంద్రగ్రహణమని తెలిపారు. జులై 16 న అర్ధరాత్రి తర్వాత 12.12 గంటలకు చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చంద్రుడి చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. తర్వాత 1.31 గంటలకు భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో గరిష్ఠ గ్రహణం కనిపిస్తుంది. తర్వా త మెల్లగా బయటికి రావడం ప్రారంభం అవుతుంది. ఉదయం 4.30 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పరిసమాప్తవుతుంది. ఉదయం 5.49 గంటలకు భూమి ఉపచ్ఛాయ నుంచి చంద్రుడు బయటికి వస్తుంది. 


చంద్రగ్రహణాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వాటిచుట్టూ ఉన్న కొన్ని ద్వీపాలు, ఆఫ్రికాలో దర్శనమిస్తుంది. ఆసియాలోని మారుమూల ఈశాన్య ప్రాంతాలు, ఐరోపాలో స్కాండినేవియాలోని మారుమూల ఉత్తర ప్రాంతాలు మినహా అన్ని చోట్లా వీక్షించే అవకాశం ఉంది. దక్షిణ అమెరికాలోని పలుచోట్ల గ్రహణం కనువిందు చేస్తుంది. భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించే దృశ్యాన్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఉత్తర మరియ దక్షిణ కొరియా, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, ఉభయ చైనాలోని దక్షిణ మారుమూల ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అర్జెంటీనా, చిలీ, బొలీవియా, పెరూ, దక్షిణ అట్లాంటిక్ సముద్రం, బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి గ్రహణం ముగిసి చంద్రుడు ఉదయించే దృశ్యాన్ని స్పష్టంగా చూడొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: