ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తుల్లో రోజా ఒకరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రోజా తన వాయిస్ ను అసెంబ్లీలో బలంగా వినిపించారని చెప్పి ఆమెను సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, సంవత్సరం తరువాత కూడా ఆమెను సభలోకి అనుమతించలేదు. సభనుంచి బహిష్కరణ మరికొంత కాలం పెంచడంతో ఆమె బయటనే ఉండిపోయింది. అయితేనేం.. బయటనుంచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించింది.
ఈసారి ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది. ఈ విజయంలో రోజా పాత్ర కీలకం అని చెప్పొచ్చు. వైకాపా అధికారంలోకి వచ్చాక రోజాకు మంత్రి పదవి వస్తుంది అనుకుంటే పక్కన పెట్టేశారు. రోజాను బుజ్జగించి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ బోర్డు కు చైర్మన్ ను చేశారు.
బోర్డు చైర్మన్ గా చాలా రోజుల క్రితమే ఆమెను ఎంపిక చేసిన ఉత్తర్వులు మొన్ననే వచ్చాయి. ఈరోజు ఆమె ఛార్జ్ తీసుకున్నారు. ఆమె పదవి ప్రమాణస్వీకారానికి ఒక్క ఎమ్మెల్యే మినహా ఎవరు హాజరు కాలేదు. రోజా లాంటి కీలక నేత పదవిని స్వీకరిస్తుంటే.. ఎవరు రాకపోవడంతో మీడియాలో వార్తలు వస్తున్నాయి. రోజాను ఒంటరిని చేశారంటూ కథనాలు వస్తున్నాయి.