''గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. గతంలో పోలిస్తే విద్యుత్‌ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి విద్యుత్‌ కొనాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

 ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..అందులో భాగంగా గతంలో ఎవరూ తీసుకోని విధంగా గతంలో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. పీపీఏల రద్దువల్ల పెట్టుబడులు వెనక్కివెళ్లిపోతాయని కొంతమంది దుష్ఫ్రచారం చేస్తోన్నారని..కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కరెంటు సరఫరా చేసేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.

‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలి. ప్రస్తుతం మనం ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొంటున్నాం. గత ప్రభుత్వం పీపీఏలను రూ.6లకు ఒప్పందం చేసుకుంది. సౌర విద్యుత్‌ఒప్పందం రూ. 4.84కు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విండ్‌ సోలార్‌, విద్యుత్‌ ధరలు తగ్గిపోయాయి.

2010లో రూ.18 ఉన్న సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.45 తగ్గింది. పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.20 నుంచి 43 పైసలకు తగ్గిపోయింది. ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనాల్సిన అవసరం రాష్ట్రానికి లేదు. అధిక ధరల ఒప్పందం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. పీపీఏలు లేకుండానే యూనిట్‌ విద్యుత్‌ను రూ. 2.72లకు అందించేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి’ అని అజేయ కల్లం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: