అధికారం కోల్పోయాక ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వస్తుంది. పార్టీపై అన్ని వైపుల నుంచి ముప్పేట రాజకీయ దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ నుంచి పొలిటికల్ దాడులు జరుగుతుంటే.... మరోవైపు ఏపీలో గ్రిప్ కోసం కాచుకుని కూర్చున్న బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం ద్వారా పలువురు కీలక నేతలపై వల వేసి తమ పార్టీలో చేర్చుకుంటోంది. తాజాగా గుంటూరు టీడీపీలో బిగ్ వికెట్ డౌన్ అయినట్టు వస్తున్న వార్తలు టిడిపి వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.
తాజాగా బీజేపీ నేత రాంమాధవ్ టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును కలవడం చర్చనీయాంశం అవుతోంది. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన రాయపాటి ఇంటికి డిన్నర్కు వెళ్లి మూడు గంటల పాటు ఆయనతో చర్చించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. సాంబశివరావు టీడీపీలో సీనియర్ నేత, భారీ టర్నోవర్ కలిగిన కంపెనీలు నిర్వహిస్తూ దేశ వ్యాప్తంగా ఎన్నో కాంట్రాక్టులు చేపడుతున్న వ్యక్తి. ఇప్పటికే ఐటీ దాడుల భయం చూపి నలుగురిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. తాజాగా రాయపాటిపై కన్నేసినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.
ఐదారు దశాబ్దాలుగా రాజకీయాలతో అనుబంధం ఉన్న ఈ ఫ్యామిలీలో రాయపాటితో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్... వీళ్ల ఇద్దరు కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్ కొడుకుతో సహా వైసీపీలో చేరాలని ఆసక్తిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధిష్టానం శ్రీనివాస్కు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా నెరవేర్చలేదు.
ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందే రాయపాటి శ్రీనివాస్ వైసీపీకి అనుకూలంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల్లో సాంబశివరావు కుమారుడు రంగారావుకు కూడా టిక్కెట్ అడిగితే చంద్రబాబు ఇవ్వలేదు. చివరకు రాయపాటికి ఎంపీ సీటు ఇచ్చేందుకే నానా ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలోనే వారి వ్యాపారాలు, ఇతరత్రా భవిష్యత్త నేపథ్యంలో వారు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టే వార్తలు వస్తున్నాయి. రామ్ మాధవ్ కూడా బీజేపీలో చేరితే భవిష్యత్తుపై అధిష్టానం హామీ ఇస్తుందని చెప్పారట.