ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన యువజన కాంగ్రెస్ రైతు శ్రామిక పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అధికారులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తునే ఉన్నారు. 151 సీట్లు కట్టబెట్టిన ప్రజలకు జవాబు దారీగా ఉండాలని.. సంజాయిషీ ఇచ్చుకొనే పరిస్థిలో మాత్రం ఉండకూడదని జగన్ ఖచ్చితంగా చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే మంత్రులకు సీఎం నుంచి హెచ్చరికలు ఉన్నా ఇప్పుడు ఏకంగా వారికి డెడ్లైన్ విధించారు.
అదే సమయంలో ఎమ్మెల్యేలను సైతం జగన్ వదల్లేదు. సమర్ధత నిరూపించుకోకుంటే పక్కన పెడతామంటూ సూటిగా సీఎం స్పష్టం చేసారు. కొందరు ఎమ్మెల్యేలే సభలో యాక్టివ్గా ఉంటున్నా... మిగిలిన వారు ఎందుకు నిర్లిప్తతో ఉంటున్నారని జగన్ ప్రశ్నించారు. సభలో జరిగే చర్చల గురించి పూర్తి సమాచారంతో రావాలని చెబుతూనే.. కొందరు ఎమ్మెల్యేల తీరు పైన పరోక్షంగా ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకు తొలి పార్టీ సమావేశం లోనే మన లక్ష్యం ఏంటో స్పష్టం చేసినా... కొందరు ఎమ్మెల్యే తీరు పైన ఫిర్యాదులు వస్తున్నాయని దీనిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
ఇప్పుడు ప్రభుత్వంలో మన పార్టీలో సమర్ధవంతమైన పాత్ర పోషించిన వారికే తిరిగి 2024లో సీట్లు ఉంటాయని..లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో వారికి అవకాశం ఉండదని నిర్మొహమాటంగా సీఎం జగన్ కుండ బద్దలు కొట్టారు. ప్రకాశం..అనంతపురం జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల తీరుపైన నిఘా వర్గాలు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రికి ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
ఎవరైనా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎటువంటి నిర్ణయానికైనా వెనుకాడనని తేల్చి చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం..పార్టీకి అధినేతగా ఉన్న తాను ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తానని..కొంత సమయం వరకు మాత్రమే వేచి చూసే ధోరణి ఉంటుందంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో..ముఖ్యమంత్రి పరోక్షంగా పార్టీ లోని ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో కొందరి వైఖరిపైన జగన్ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని.. దీని ఆధారంగానే సీఎం మాట్లాడారని సీనియర్లు చెబుతున్నారు. ఇప్పుడు సీఎం చేసిన కామెంట్లు అటు పార్టీలో..ప్రభుత్వంలో హాట్ టాపిక్గా మారాయి.