తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం లో ఉద్యోగవకాశాలు రాలేదని వైకాపా సర్కార్ అసత్యాలను ప్రచారం చేస్తోందన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాం లో 5. 60 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ సాక్ష్యాధారాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు . రానున్న రోజుల్లో మరో ఎనిమిది లక్షల ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు .
ఇంకా లోకేష్ ఏమన్నారంటే ... పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్ , ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు. 'జాబు రావాలి అంటే బాబు పోవాలి', 'బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు' అంటూ ఎన్నో అబద్దాలను జగన్ పాదయాత్రలో చెప్పారు . ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుగారి హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు కల్పించారని నిజాలను చెబుతున్నారని అన్నారు .
ఐటీలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారని అన్నారు . అలాగే ఎలెక్ట్రానిక్స్ ఇంకా ఇతర రంగాల్లో తామిచ్చిన ఉద్యోగాలు, ఏర్పాటవుతున్న కంపెనీలు, రాబోయే ఉద్యోగాల వివరాలు కూడా బయటపెట్టి మీ పత్రిక అసత్యాల సాక్షి అని ప్రజలందరికీ తెలియజేయాలని జగన్ ను కోరుతున్నానని ఎద్దేవా చేశారు .