అసెంబ్లీలో వైసీపీ మంత్రులు చెబుతున్న లెక్కలను టీడీపీ బాగా ఉపయోగించుకుంటోంది. వాటి ఆధారంగానే వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల ఉపాధి అవకాశాల గురించి వైసీపీ చెప్పిన లెక్కల ఆధారంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ ను టార్గెట్ చేశారు.


చంద్రబాబు దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించారని జగనే ఒప్పుకున్నారని లోకేశ్ ట్వీట్ ద్వారా ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్ గారు, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలన్నారు. 'జాబు రావాలి అంటే బాబు పోవాలి', 'బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు' ఇలాంటి ఎన్నో అబద్దాలను పాదయాత్రలో చెప్పారు జగన్ గారు అని గుర్తు చేశారు.


నారా లోకేశ్ ఇంకా ట్విట్టర్లో ఇంకా ఏమన్నారంటే.. "ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుగారి హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు కల్పించారు అని చెప్పారు. ఐటీలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు.


ఇలానే ఎలెక్ట్రానిక్స్ ఇంకా ఇతర రంగాల్లో మేమిచ్చిన ఉద్యోగాలు, ఏర్పాటవుతున్న కంపెనీలు, రాబోయే ఉద్యోగాల వివరాలు కూడా బయటపెట్టి మీ పత్రిక అసత్యాల సాక్షి అని ప్రజలందరికీ తెలియజేయాలని జగన్ గారిని కోరుతున్నాను ఏర్పాటవుతున్న కంపెనీల వివరాలు మీరెలాగూ బయట పెట్టరు. ఇవిగోండి! మీరు చెప్తున్న 5.60 లక్షల ఉద్యోగాలతో పాటు చంద్రబాబుగారి హయాంలో పనులు ప్రారంభించి, రాబోయే రోజుల్లో యువతకు అందించబోతున్న మరో 8 లక్షల పైచిలుకు ఉద్యోగాల వివరాలు. ఇవి కూడా మీ ఘనతగా చెప్పుకుంటారేమో! “


మరింత సమాచారం తెలుసుకోండి: