రాజకీయంగా సంధికాలంలో ఉన్న టీడీపీకి ఇప్పుడు పార్టీని నిలబెట్టగలిగే సరైన నాయకుల అవసరం చాలా ఉంది. ము ఖ్యమైన కేంద్రాల్లో పార్టీని నిలబెట్టుకునేందుకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. తాజాగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా.. సీమలో మాత్రం టీడీపీ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. తెలుగుదేశానికి ఘోరమైన ఫలితాలొచ్చాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీకి దక్కిన సీట్లు మూడే మూడు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు, అనంతపురం జిల్లాలో బాలయ్య, పయ్యావుల కేశవ్ విజయం సాధించారు.
కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి ఒక్క సీటూ రాలేదు. ముందు నుంచి పట్టున్న రాయలసీమలో ఈసారి ఎందుకు వెనకబడిపో యామన్నది చంద్రబాబుకు కూడా అంతబట్టని విషయంగా మారిపోయింది. అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు. అ నంతపురంలో కియా పరిశ్రమను నెలకొల్పారు. చిత్తూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇలా అనేక కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు కూడా చంద్రబాబు రూపకల్పన చేసి ముందుకు సాగారు. అయితే, ఆయన అనుకున్న విధంగా ఏదీ జరగలేదు. దీంతో సీమలో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఓటమి ఎలా ఉన్నా .. ఇప్పుడు పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయితే, అనూహ్యంగా పార్టీ నాయకులు జంప్లు చేస్తున్నారు. దీంతో ఎవరైతే.. పార్టీని అనుకున్న విధంగా ముందుకు నడిపిస్తారనే చర్చ సాగినప్పుడు బాబు వియ్యంకుడు, ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు సీమ పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. బాగుంటుందనే అభిప్రాయం వెలువడినట్టు సమాచారం. ఇక్కడ ఆది నుంచి కూడా టీడీపీకి పట్టు ఉందని, ఒక్క కడప మినహాయిస్తే.,. మిగిలిన మూడు జిల్లాలలోనూ పార్టీని గౌరవిస్తారని, ఈ క్రమంలో బాలయ్యను ఈ నాలుగు జిల్లా లకు ఇంచార్జ్గా నియమిస్తే.. బెటర్ అని సూచించారట. దీనిపై చంద్రబాబు తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించ నున్నా రు.
అయితే, ఇక్కడే కొన్ని ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. బాలయ్య ఇక్కడ దూసుకుపోతారా? అనేది ప్రధాన ప్రశ్న. ఇక్కడ వైసీపీకి అనుకూల నాయకులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, బీసీ వర్గానికి చెందిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ బాలయ్య అరంగేట్రం చేసి, పార్టీని నడిపించేందుకు వీరిని కూడగట్టాల్సి ఉంది. కానీ దుందుడుకు స్వభావం ఉన్న బాలయ్యకు ఇది చాతకాదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భావిస్తున్నట్టుగా ఇక్కడ పార్టీ పగ్గాలు బాలయ్యకు ఇచ్చి కూడా పెద్దగా ప్రయోజనం ఏంటుంది? అనే వారు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.