ఒక వ్యక్తి కష్టపడి పైకి రావడం..మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఎంత గొప్ప విషయమో..ఆ పేరు శాశ్వతంగా నిలుపుకోవడం అంతే కష్టం. కొందరికి వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని అత్యాశతో ఎంతలా చెడగొట్టుకుంటారో చెప్పేందుకు వీలుగా శరవణ భవన్ అధినేత 72 ఏళ్ల రాజగోపాల్ ఉదంతాన్నిచెప్పాలి. పేరుకు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అత్యాశ వల్ల ఆయన పతనానికి కారణం అయ్యింది. స్వయంశక్తితో పైకొచ్చిన రాజగోపాల్ కు.. ఆ స్థానం సరిపోలేదు.. మరింత ఎదిగేందుకు ఊహించని రీతిలో నిచమైన పథకం వేశారు.
తన దగ్గర పని చేస్తున్న వివాహితను పెళ్లాడితే తన సుడి మొత్తం తిరిగిపోతుందని.. మరింత ఎదిగిపోవచ్చన్న ఒక జ్యోతిష్యుడి సలహాను నమ్మి.. ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అప్పటికే ఆయనకు రెండు పెళ్లిళ్లు కావడంతో ఆమె ఆయన ప్రపోజల్ ని వ్యతిరేకించింది. దీంతో.. ఆమె భర్తను చంపేస్తే.. తనను తప్పక పెళ్లాడుతుందన్న దుర్మార్గంతో కిరాయి గూండాలతో హత్య చేయించాడు. ఈ కేసు మెడకు చుట్టుకోవటమే కాదు.. హత్య చేయించిన వైనం కోర్టులో రుజువైంది. పాపం పండి..ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష విధించారు. హోటల్ శరవణభవన్ అధినేత రాజగోపాల్(72) గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు.
1947లో తూత్తుకుడిలో రాజగోపాల్ జన్మించాడు. వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ దోశ కింగ్ గా పేరు సంపాదించాడు. 1981లో చెన్నైలో తొలిసారి హోటల్ శరవణ భవన్ను స్థాపించాడు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి పలు దేశాల్లో తన హోటళ్లను విస్తరించాడు. కానీ ఆయన అత్యాశ చివరికి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి చేర్చింది.
కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగినా.. స్వయంకృషిపై నమ్మకం లేక.. కేవలం జాతకం వల్లే ఎదిగానని.. నమ్మారు… శవరణభవన్ రాజగోపాల్. కష్టపడి తెచ్చుకున్న పేరు, ప్రతిష్ట.. అన్నీ మసకబారిపోయాయి. చివరికి.. ఓ హంతకుడిగా.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ మనోవ్యధనే తట్టుకోలేక… ప్రాణాలు పోయేంతగా మథనపడ్డారు. చివరికి తనువు చాలించారు. యువతకు స్ఫూర్తిగా నిలవాల్సిన వ్యక్తి.. విలన్గా.. చివరిలో అందరి మనసుల్లో ముద్ర వేసి.. తనువు చాలించాడు.