రోజా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత వై ఎస్ జగన్ ను నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీతోనే ఉన్నది. పార్టీకోసం చాలా త్యాగాలు చేసింది. పార్టీ కోసం 2014నుంచి అసెంబ్లీలో తన వాయిస్ ను వినిపించింది.
సస్పెండ్ అయ్యి బయటకు వచ్చినా కూడా రోజా తన వాయిస్ ను వినిపించడం మానలేదు. వీలు చిక్కినప్పుడల్లా తెలుగుదేశంపై విరుచుకుపడింది. 2019 లో వైకాపా అధికారంలోకి రావడంతో ఆమెకు తప్పకుండా మంత్రిపదవి వస్తుందని అనుకున్నారు. ఆ దిశగానే వార్తలు వచ్చాయి.
చివరి వరకు అదే అనుకున్నా చివరికి మాత్రం ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఆమె మంత్రుల ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకాలేదు. జగన్ పిలిచి బుజ్జగించి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. పదవులు ఏవి అవసరం లేదని చెప్పినా ఆమెకు ఆ పదవి ఇచ్చారు.
నామినేటెడ్ పదవీ వచ్చినా రోజా అసంతృప్తితో ఉన్నదని, రోజాకు పార్టీలో అన్యాయం జరిగిందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో రోజాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. రోజాకూడా ఈ నామినేటెడ్ పదవిపై పెద్దగా ఉత్సాహం చూపడం లేదని సమాచారం. రెండేళ్ల తరువాత కొత్త మంత్రివర్గాన్ని తీసుకుంటారు కాబట్టి అప్పుడు రోజాకు మంత్రి పదవి ఇస్తారేమో చూడాలి.