రాజధాని, అమరావతికి అప్పు ఇచ్చే విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కు తగ్గిన నేపథ్యంలో కొన్ని షాకింగ్‌ వార్తలు వెలువడుతున్నాయి.

వరల్డ్‌ బ్యాంకు నిర్ణయం పై ఎటువంటి సమాచారమూ లేదని సిఆర్‌డిఎ కమిషనర్‌ లక్ష్మీనరసింహం చెబుతున్నప్పటికీ, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన సమయంలో ప్రపంచ బ్యాంకు నుండి ఒక లేఖ ఏపీ ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో గత ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్‌కి మధ్య ఏం జరిగిందంటే...

1, మూడువేల ఎకరాలు 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాల్సి ఉందని సిఆర్‌డిఎ తెలుపుతూ, సుమారు రూ.4770 కోట్ల రుణం ఇవ్వాలని 2016 ఆగస్టు 8న సిఆర్‌డిఏ ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసింది. దీనికి ప్రపంచబ్యాంకు పి159808 నెంబరుతో ఫైలు కూడా కేటాయించింది.

2, తమకు ఇష్టం లేకుండా భూమిని సమీకరించారని రైతులు,సామాజిక వేత్తలు ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేశారు.

3, దీనిపై ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి విచారణ జరిపిన అనంతరం ప్రపంచబ్యాంకు 2017 జనవరిలో సిఆర్‌డిఎకు లేఖ రాసింది.

4, అక్కడ రైతుల ఇష్టం లేకుండా భూములు తీసుకున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు

5, వరల్డ్‌బ్యాంక్‌ లేఖకు సమాధానంగా, సిఆర్‌డిఎ అధికారుల వివరణపై సంతప్తి చెందని బ్యాంకు టీమ్‌ మరోసారి రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలు తీసుకుంది.

6, భూసేకరణ చట్టం(2013) కింద కాకుండా సమీకరణ ద్వారా భూమి సేకరించడం సాధ్యమా కాదా చెప్పాలని మరో లేఖ సిఆర్‌డిఎకు రాస్తూ, ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరింత లోతైన పరిశీలన అవసరమని పేర్కొంది.

7, ఈ లేఖల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగి వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ఒక లేఖ వచ్చింది. మరోసారి అమరావతిలో పూర్తిస్థాయిలో తనిఖీకి మీరు అంగీకరిస్తారో లేదో చెప్పాలన్నది ఆ లేఖలో కోరింది.

8, కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందున, అమరావతి పై అధ్యయనం చేసి, తమ నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచబ్యాంకు కి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది.

9, అమరావతి తనిఖీ ఇప్పట్లో తేలే లా లేదని, భావించిన బ్యాంకు యాజమాన్యం రాజధానికి రుణం ప్రతిపాదన నుండి తొలగింది.

జగన్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని లైట్‌గా తీసుకోవడం వెనుక అసలు కారణం ఉంది. అమరావతిలో ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌ టీమ్‌ తనిఖీకి అనుమతివ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు తెలుస్తోంది.

రుణం మంజూరు చేయడానికి ముందే ఇలా తనిఖీల పేరుతో హడావుడి చేయడం కొత్త సంప్రదాయాన్ని అలవాటు చేసినట్టువుతుందని, దేశంలో ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో అమలవుతున్న కొన్ని ప్రాజెక్టులపై నెగిటివ్‌ ఇంపాక్ట్‌ కలుగుతుందని, కేంద్రం హెచ్చరించడంతో, బ్యాంకు తనిఖీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదని అర్ధిక నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: