భారతీయ జనతాపార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ముఖ్యనేత అమిత్ షా హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలు కీలక కమిటీలకు నాయకత్వం వహిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరింత పట్టుసాధిస్తున్నారు. తాజాగా ఓ ముఖ్య నేత పదవికి ఎసరు పెట్టి మరీ...తన ముద్రను వేసుకోనున్నారు. ఈ మేరకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటా విక్రయానికి ఏర్పాటు చేసిన కమిటీకి కూడా నాయకత్వం వహించబోతున్నారు. ఈ కమిటీలో ఇప్పటివరకు ఉన్న రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తప్పించి ఆ స్థానంలో అమిత్ షా నియమితులైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియాను ఈ సంక్షోభం నుంచి బయటపడేయటానికి జూన్ 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సార్థథ్యంలో ఎయిర్ ఇండియా స్పెసిఫైస్ అల్ట్రానెటివ్ మెకానిజం(ఏఐఎస్ఏం) పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అప్పటి మంత్రులు అశోక్ గజపతిరాజు, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీలు ఉన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రెండోదఫా అధికారంలోకి రావడంతో ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించినట్లు, దీంట్లోభాగంగా నితిన్ గడ్కరీ ఈ ప్యానెల్లో ఉండబోరని ఆ వర్గాలు వెల్లడించాయి.
గతంలో ఐదుగురు సభ్యులు ఉండగా, దీనిని నలుగురికి కుదించారు. ప్రస్తుతం ఈ కమిటీలో షాతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య-రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పూరిలు ఉన్నారు. కంపెనీలో 76 శాతం వాటా కలిగిన ఎయిర్ ఇండియాలో వాటా విక్రయించనున్నట్లు పలుమార్లు ప్రకటించినప్పటికీ ఒక్క సంస్థ కూడా ముందుకురాలేదు. దీంతో ఇప్పటి వరకు బిడ్డింగ్ ప్రక్రియ మూడుసార్లు వాయిదాపడింది. కాగా, షా నాయకత్వంలో ఏ విధంగా ఈ డీల్ జరుగుతుందో వేచి చూడాల్సిందే.