కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో గత బుధవారం ఓ భూవివాదం కేసులో పది మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అక్కడకు వెళ్లారు. అయితే ఆమెను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. కేవలం నలుగురు వ్యక్తులతో మాత్రమే మాట్లాడుతా అని చెప్పినా.. తనను అడ్డుకుంటున్నారని ప్రియాంకా అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
కేవలం నలుగురినే తన వెంట తీసుకెళ్తానని, బాధిత కుటుంబాలను కలుస్తానని చెప్పినా అధికారులు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రియాంక గాంధీ రోడ్డుపైనే బైఠాయించారు. మొదట ప్రియాంకా శాంతియుత ధర్నాకు కూర్చున్నారు.శాంతియుతంగానే నిరసన చేపడుతామని అన్నారు. నారాయణ్పూర్ ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం సోన్భద్రలో 144 సెక్షన్ విధించారు. తనను ఎక్కడకు తీసుకువెళ్తున్నారో తనకు తెలియదని, ఎక్కడికి వెళ్లేందుకైనా తాను సిద్ధమే అని ప్రియాంకా అన్నారు.
కాగా, ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 29మందిని అరెస్టు చేశామని, సింగిల్ బ్యారెల్ గన్, మూడు డబుల్ బ్యారెల్ తుపాకులు, ఓ రైఫిల్ను సీజ్ చేశామని సీఎం చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూపీ అసెంబ్లీ కూడా ఇవాళ ఇదే అంశంపై వాయిదా పడింది.