బెజవాడ టిడిపి ఎంపి కేశినేని నాని జంపింగ్ స్కెచ్ రెడీ అయినట్టే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త బెజవాడ రాజకీయ వర్గాల్లో జోరుగా హల్చల్ చేస్తోంది. ఎన్నికలు వచ్చినప్పటి నుంచే నాని తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో పాటు జిల్లా టిడిపి నేతలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా లోకేష్ ను టార్గెట్ చేయడం ప్రారంభించిన నాని... ఆ తర్వాత బెజవాడకే చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అటు బుద్ధా వెంకన్న సైతం నానీకి ధీటుగా విమర్శలు చేసినా ఆ తర్వాత చంద్రబాబు సూచనల మేరకు సైలెంట్ అయ్యారు.
నానికి మాత్రం తన సోషల్ మీడియాలో వెంకన్న పై దాడి ఆపలేదు. చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు గారు మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకోకపోతే... తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని నేరుగా వార్నింగ్ ఇచ్చారు. కేశినేని నాని సోషల్ మీడియా వార్ వెనక ఆయన బిజేపిలోకి జంప్ చేసే స్కెచ్ ఉందని ఇప్పటికే ఆయన పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారని... అందుకు తగిన సమయంతో పాటు మంచి ముహూర్తం మాత్రమే మిగిలి వుందన్న చర్చలు నడుస్తున్నాయి.
కేశినేని నాని.. ఉద్దేశ పూర్వకంగానే విజయవాడ రాజకీయాలను వేడెక్కించారని అంటున్నారు పరిశీలకులు. ముందుగా దేవినేని ఉమాను కెలికిన నాని అటు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతోనే బుద్ధాను టార్గెట్గా చేసుకుని... ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లిన నాని టీడీపీ అధిష్టానానికి తనపై కోపం వచ్చేలా చేసి.. ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెన్షన్ వేయించుకుని.. అప్పుడు బీజేపీలోకి వెళ్లాలన్న ప్లాన్తో ఉన్నాడట.
ఇదంతా ఇటీవల టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి డైరెక్షన్లోనే నడుస్తుందన్న అనుమానాలు కూడా టీడీపీ వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. తాను ఎలాగూ.. బీజేపీలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నాని.. నేరుగా వెళ్లిపోవడం ఇష్టంలేక తనంతట తానే పొగ పెట్టుకుని, బయటకు వచ్చేలా స్కెచ్ అమలు చేస్తున్నాడన్నదే ఇప్పుడు టీడీపీ వర్గాల ఆరోపణ.