కర్ణాటకలో పొలిటికల్ వార్ గవర్నర్ వర్సెస్ సిఎంగా మారింది. ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది. రెండు వారాలుగా కొనసాగుతున్న పొలిటికల్ డ్రామా కొత్త మలుపు తిరిగింది. గవర్నర్ వాజుభాయి వాలా మెజారిటీని నిరూపించుకోవాలని తెలిపినా ప్రభుత్వం బేఖాతరు చేసింది.శుక్రవారం కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఎలాంటి పరీక్ష జరగకుండానే స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు విశ్వాస తీర్మానంపై చర్చను కొనసాగించనున్నారు.
అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అంతకుముందు బీజేపీ సభ్యులు బలపరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాల్సిందేనంటూ పట్టుబట్టారు. సభలో నిల్చుని ఆందోళనకు కూడా దిగారు. వారి ఆందోళనల మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు. మొదట్నుంచీ సభను వాయిదా వేయించే దిశగానే కాంగ్రెస్ అడుగులు వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష చేపట్టాలి అంటూ బీజేపీ సభ్యులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఇదే సమయంలో విశ్వాసపరీక్షపై ప్రతి ఒక్కరూ మాట్లాడేలా స్పీకర్ అవకాశం కల్పించారు.
దీంతో అవిశ్వాసంపై చర్చ ముగియాలంటే రెండు లేదా మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేయాలని సంఘం నేతలు కోరారు. కర్ణాటక రాజకీయాలు మళ్లీ హస్తినకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, సీఎం కుమారస్వామి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. సభ జరుగుతున్న సమయంలోనే వీళ్ళు సుప్రీంను ఆశ్రయించారు. పార్టీ విప్ విషయంలో ఈ నెల 17 న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో అస్పష్టత నెలకొందని, దీనిపై పునఃసమీక్షించుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు.సభా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పైన కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.
దీంతో కర్ణాటక రాజకీయం మరోసారి హస్తినకు చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే, అసెంబ్లీ సోమవారానికి వాయిదా వేయడంతో బలనిరూపణ తాత్కాలికంగా వాయిదా పడింది తాజా పరిణామాలతో తమ బలాన్ని నిరూపించుకోవడం సీఎం కుమారస్వామికి అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో నంబర్ గేమ్ ఉత్కంఠ రేపుతోంది. కర్ణాటకలో బలనిరూపణ నేపథ్యంలో సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ పై ఆసక్తికర చర్చ సాగింది.బలనిరూపణ చేపట్టాలంటూ బిజెపి, మరోవైపు విశ్వాసపరీక్షపై గవర్నర్ జోక్యం సరికాదంటూ సంకీర్ణ కూటమి పార్టీలు వాదోపవాదాలతో సభ దద్దరిల్లింది. ఈనేపధ్యంలో ఆసక్తికరంగా నిమ్మకాయలు చేతబడి ప్రస్తావనకొచ్చాయి. ఓవైౖపు విశ్వాస పరీక్షకు డివిజన్ ప్రవేశ పెట్టాలని బీజేపీ పట్టుబడుతున్న సమయంలో సీఎం కుమారస్వామి ఈ ప్రస్తావన లేవనెత్తారు.
బీజేపీ సభ్యులు పలుమార్లు తన సోదరుడు మంత్రి రేవన్న మూఢనమ్మకాలను విమర్శించిన నేపథ్యంలో సీఎం కుమారస్వామి స్పందించారు.నిమ్మకాయలు చేతబడులు ప్రభుత్వాన్ని రక్షించలేవు కదా అంటూ వ్యాఖ్యానించారు నిమ్మకాయలు చేత పట్టుకోవటంపై, బీజేపీ నాయకులు రేవన్నను విమర్శించారు. హిందూ విశ్వాసాలను నమ్మే బీజేపీ నాయకులు రేవణ్ణను విమర్శించటం తగదన్నారు కుమారస్వామి. రేవణ్ణ ఎప్పుడు కూడా నిమ్మకాయను చేత్తో పట్టుకుంటారు, గుడికి వెళ్తారు. ఆయనేదో చేతబడి చేస్తున్నారన్నట్లుగా బీజేపీవాళ్ళు విమర్శిస్తున్నారని సీఎం కుమారస్వామి మండిపడ్డారు మరోవైపు అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నేపథ్యంలో రేవణ్ణ తెలుపు రంగు షర్ట్, లుంగీ ధరించి అసెంబ్లీకి వచ్చారు.
పైగా కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా సభకు హాజరు కావడం చర్చ నీయాంశంగా మారింది.కర్ణాటక అసెంబ్లీ సోమవారానికి వాయిదా వేయడం పట్ల బిజెపి నాయకులు యడ్యూరప్ప విమర్శించారు స్పీకర్ రమేశ్ కుమార్ సీఎం కుమారస్వామి సీఎల్పీ నాయకుడు కుట్ర పూరితంగా వ్యవహరించి సభను వాయిదా వేయించారని విమర్శించారు సభలో ఓటింగ్ జరిగితే ప్రభుత్వం పడి పోయే ప్రమాదం ఉందని తెలిసే సంకీర్ణకూటమి ఓటింగ్ ను అడ్డు కుంటోందంటూ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధితో సంకీర్ణ సర్కార్ ఆడుకుంటోందని యడ్యూరప్ప విమర్శించారు. తాజా రాజకీయ సంక్షోభానికి త్వరలోనే ముగింపు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.