అరుణాచల్‌ప్రదేశ్‌లో వరుసగా నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించాయి.  శుక్రవారం మూడుసార్లు భూమి కంపించగా..ఇవాళ తెల్లవారుజామున మరోసారి భూమి కంపించింది. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 5.6, 3.8, 4.9, మరియు 5.5గా నమోదయ్యాయి.  శుక్రవారం మధ్యాహ్నం 2:52 గంటల సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈస్ట్ కామేంగ్ జిల్లాలో భూమి కంపించింది. ఇక్కడ 5.6గా భూకంప తీవ్రత నమోదైంది.


మధ్యాహ్నం 3:04 గంటల సమయంలో 3.8 తీవ్రతతో ఈస్ట్ కామేంగ్ జిల్లాలోనే మరోసారి భూమి కంపించింది. ఇక మూడో ప్రకంపనం.. మధ్యాహ్నం 3:21 గంటల సమయంలో కురుంగ్ కుమేయ్ జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. మరోవైపు ఇవాళ తెల్లవారుజామున 4.24 గంటలకు ఈస్ట్ కామేంగ్ జిల్లాలోనే మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి.


వరుస భూప్రకంపనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూకంప ప్రభావం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలియజేశారు. కాకపోతే పదే పదే భూప్రకంపనల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: