ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయా ? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. ఒక ఎంపీ స్థానానికి నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు జరగవచ్చునని అంచనా వేస్తున్నారు . ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని , నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ తనను పార్టీలో కొనసాగమంటారా... లేకపోతే రాజీనామా చేయమంటారా ప్రశ్నించిన విషయం తెలిసిందే.
బిజెపి నేతలతో టచ్ లో ఉన్న ఆయన త్వరలోనే, టీడీపీ కి గుడ్ బై చెప్పి కాషాయం కండువా కప్పుకునే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది . తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఎంత మెజార్టీ సాధించానో ... ఇండిపెండెంట్ కూడా అంతే మెజారిటీ సాధిస్తామని నాని చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం, తన ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరాలని భావిస్తున్నట్లు ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అదే జరిగితే విజయవాడ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైకాపాలో చేరే చేరే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి .
గంటా తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణతో గంటా శ్రీనివాసరావు సమాలోచనలు చేశారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి . అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు విజయవాడ లోక్ సభ , మరో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు