ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసింది . ప్రస్తుతానికి ఆ పార్టీ లో ప్రజాప్రతినిధులు ఎవరు చేరేందుకు సిద్ధంగా లేకపోయినప్పటికీ , మాజీ ఎమ్మెల్యేలను , ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గా పోటీ చేసిన అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది .
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చదలవాడ అరవింద్ బాబు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి , బీజేపీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు . ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆయన నివాసంలో కలుసుకుని సమాలోచనలు చేశారు. చదలవాడ అరవింద బాబు బీజేపీలో చేరేందుకే కన్నాను కలిశారన్న ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా రాష్ట్రంలో బలపడేందుకు టీడీపీ నేతల పై ఆకర్ష ఆకర్ష అస్త్రాన్ని సంధిస్తోంది బిజెపి నాయకత్వం తాజాగా చదలవాడ అరవింద్ పై కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించినట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ నుంచి బీజేపీ లోకి వలసలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. తొలుత టీడీపీ కి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగా , ఆ తరువాత పార్టీకి చెందిన కీలక నాయకులు ఒకరి తరువాత మరొకరు క్యూ కడుతున్నారు .