దాదాపుగా ఇరవై మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇప్పుడు పోస్టింగులు లేక ఖాళీగా ఉన్నారు. శశిభూషణ్ కుమార్,సతీష్చంద్ర,ప్రద్యుమ్న లాంటి చురుకైన అధికారులను ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించారు. నవరత్నాలు వంటి పథకాలు అమలులో ఈ సీనియర్స్ని తీసుకుంటే పాలన సజావుగా జరుగుతుంది.
చిత్తూరు జిల్లా కలెక్టర్ గా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ప్రద్యుమ్న ముక్కుకు సూటిగా వ్యవహరిస్తారని పేరుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లడంలో అలుపెరగక పని చేశారని చిత్తూరు జిల్లా జనం చెప్పుకుంటారు. ఆయన సేవలకు ఉత్తమ ఐఏఎస్ గా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇలాంటి నిజాయితీ పరులైన అధికారులకు పని లేకుండా చేయడం సమంజసం కాదని విశ్లేషకుల భావన.
ఇక డిప్యూటేషన్ పై వచ్చిన వారిని వారి.. క్యాడర్ రాష్ట్రాలకూ పంపలేదు. అయినప్పటికీ.. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను తీసుకొచ్చే పనిలో జగన్ ఉన్నారు. దీనిపై కేంద్రం కూడా అసహనం వ్యక్తం చేస్తోందన్న ప్రచారం కూడా ఢిల్లీలో జరుగుతోంది.
డిప్యూటేషన్ల వెల్లువ...
వైఎస్ జగన్... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులనే కాదు.. పలువురు ఇతర అధికారులను కూడా.. ఢిల్లీ నుంచి డిప్యూటేషన్ పై తీసుకొచ్చారు. టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డి. కేంద్ర హోంశాఖ నుండి, పట్టుబట్టి మరీ తీసుకొచ్చారు. అలాగే సమాచార శాఖ కమిషనర్గా వచ్చిన విజయకుమార్ రెడ్డిని కూడా డిప్యూటేషన్పై తీసుకొచ్చారు. మరి కొందరు రాబోతున్నారు. ఇలా.. ఏ ప్రతిపాదికన.. అధికారులను తీసుకొస్తున్నారనేది పరిశీలకులకు పజిల్గా మారింది. ఇలా వస్తున్న వారిలో ఎక్కువ శాతం ఒకే సామాజికవర్గం కావడంతో. ఆ కోణంలోనే వారికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.. వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ.. జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నమ్మకంగా పనిచేస్తారని, తీసుకొస్తున్నారన్న ప్రచారం మీడియా వర్గాల్లో జరుగుతోంది.