నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నిరసనల రూపం మారుతోంది. నీళ్లు, నిధుల విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్కారు వైఖరిపై వ్యతిరేకత వైఖరి కంటే, ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు పలు సందర్భాల్లో జరిగిన ఆందోళనలు తార్కాణంగా పేర్కొంటున్నారు. అయితే, తాజాగా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. నిరుద్యోగుల మనోభావాల నేపథ్యంలో ఏకంగా ట్యాంక్బండ్లో ఆందోళన తెలపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గత కొద్దికాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం పైకి ఎక్కి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కనువిప్పు కలగాలనే.... తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కాగా, పోలీసులు రంగప్రవేశం చేసి వీరి ఆందోళనను విరమించారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు.