జమ్మలమడుగు లోని ముద్దనూరు రోడ్డు వద్ద 14 నాటు బాంబులు లభ్యమవ్వడంతో స్థానికంగా కలకలం రేగింది. మంగళవారం ఉదయం రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం భూమిని చదును చేస్తుండగా.. బాంబులు దొరికాయి. ముద్దనూరు రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో లే అవుట్ వేసేందుకు భూమిని చదును చేస్తుండగా బక్కెట్లో నాటు బాంబులు బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబులను జాగ్రత్తగా వెలికి తీస్తున్నారు. ఇప్పటివరకూ 14 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా అక్కడ ఏమైనా నాటు బాంబులు ఉన్నాయా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అయితే ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ... జేసీబీతో భూమిని చదును చేస్తుండగా బక్కెట్లో నాటు బాంబులు బయటపడ్డాయి. వీటిని గతంలోనే భూమిలో పాతి పెట్టి ఉంటారని భావిస్తున్నామని, దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.