ప్రభుత్వాలు మారినా బిసి, ఎస్సీ హాస్టళ్లల్లోని విద్యార్ధుల తలరాతలు మాత్రం మారటం లేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సైతం సంబంధిత అధికారులు బోక్కేస్తూ పేద విద్యార్ధుల పాలిట పాశాలులాగా మారుతున్నారు. కలుషిత ఆహారాన్ని పెట్టి 80 మంది విద్యార్దుల ప్రాణాలతో చెలగాటం ఆడారంటే ఏ స్థాయిలో వసతి గృహాలు నడుస్తున్నాయో అర్ధమవుతుంది. కైకలూరులోని బాలికల వసతి గృహాంలో వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా సుమారు 26 మంది బాలికలు ఆసుపత్రి పాలయ్యారు. కేవలం పురుగుల ఆహారం, కలుషిత నీటిని త్రాగటం వలనే అని వైద్యులు నిర్ధారించారు.
ఇప్పటికే నూతన ప్రభుత్వం నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని మెనూ ప్రకారం విద్యార్ధులకు ఫౌష్టికమైన ఆహారం ఇవ్వాలని ఆదేశాలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్కచేయకుండ సదరు మేట్రిన్ మనీని పక్కన వేసుకునేందుకు విద్యార్ధులకు నాసిరకం ఆహారాన్ని ఇస్తున్నట్లు విద్యార్దులు బోరున విలపిస్తున్నారు. సదరు వార్డెన్ అవినీతి కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మేట్రిన్ మల్లీశ్వరిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇటీవల బాలికల హాస్టల్లో ప్రజాప్రతినిదులు సందర్శించారు. విద్యార్ధినులను సౌకర్యాలు గురించి మరీ అడిగి తెలుసుకున్నారు. ఏదో తూతూమంత్రంగా ఫోటోలకు ఫోజులిచ్చి వచ్చారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సందర్శించి 24 గంటలు గడవకముందే 82 మంది విద్యార్ధులు ఆసుపత్రి పాలవ్వడం ఆశ్యర్యానికి గురిచేస్తుంది. విద్యార్ధులు సరైన సౌకర్యాలు లేవని సదరు ఎమ్మెల్యే ముందు వాపోయినప్పుడైనా మేట్రిన్పై చర్యలు తీసుకుంటే ఇంత దుస్థితి ఏర్పడేది కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.