ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో 'బాబు' ఒడిపోయాక ప్రతి వైసీపీ ఎమ్మెల్యే 'బాబు'ను అతి చులకనగా చూస్తూ పచ్చిగా హేళనలు చేస్తూ.. నానా హడావుడి చేస్తున్నారు. భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామనే ధీమాతో జగన్ సైతం, బాబు పై మరీ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే చాల రకాల సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ బాబుని నానా మాటలు అంటూ కొన్ని వర్గాలు విమర్శలు చేసేలా ప్రవర్తిస్తున్నారనేది వైసీపీ అభిమానులు సైతం అంగీకరిస్తోన్న సత్యం.
జగన్ కి ఇది నష్టం కలిగించేదే గాని, ఏ మాత్రం లాభదాయకం కాదు. బాబు వయసు రీత్యా మరియు అనుభవం రీత్యా గౌరవింప బడాల్సిన వ్యక్తి, అయితే బాబును రాజకీయంగా ఎన్నో మాటలు అనొచ్చు.. అవసరమైతే, బాబు అవినీతి చేసాడని.. నిరూపించి జైలుకు సైతం పంపొచ్చు. కానీ జగన్ మాత్రం అలా చేయకుండా బాబుని దూషిస్తూ.. అవమానిస్తూ ప్రజల్లో ఆయనుకున్న విలువను తగ్గించుకుంటున్నారు. దీనికి తోడు తన నాయకుల చేత నానా మాటలు అనిపిస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేత అసెంబ్లీలో బాబును బాగా తిట్టించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే సహించేది లేదని బాబును ఆ ఎమ్మెల్యే తీవ్రమైన పదజాలంతో హెచ్చరించాడు. అసలు ఎవరి ప్రభుత్వానికి ఎవరు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. స్వయంగా వైసీపీ నాయకులే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారే తప్ప.. వేరే ఎవరి వల్ల చెడ్డ పేరు రావట్లేదు. ఇప్పటికైనా జగన్ ఈ విషయంలో తన వైఖరిని, తమ పార్టీ నాయకుల వైఖరిని ఒకసారి సరిచూసుకుంటే ఆయనకే మంచింది.