టాలీవుడ్ లో యువరత్న నందమూరి బాలకృష్ణకు సింహ - లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు ఏపీ అసెంబ్లీని ఒక ఊపు ఊపేస్తున్నాడు. అసెంబ్లీలో అధికార వైసిపి బోయపాటి శ్రీనుపై బుధవారం ఎటాక్ చేసింది. అదేంటి ఏపీ అసెంబ్లీకి బోయపాటికి సంబంధం ఏంటి ?వైసిపి బోయపాటిని ఎందుకు ? టార్గెట్ చేసింది అన్నది అందరికి తెలిసిందే. గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రారంభోత్సవం రోజున చంద్రబాబు పుష్కరాలు ప్రారంభిస్తున్న సన్నివేశాలను షూట్ చేసే క్రమంలో గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు మృతి చెందారు.
బోయపాటి షూటింగ్ కోసం గంటకు పైగా భక్తులను ఆపేయడంతో అక్కడ తొక్కిసలాట జరిగి వీరంతా మృతిచెందారు. ఈ సంఘటనపై వైసిపి అప్పట్లో అసెంబ్లీలో పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కమిటీ వేసి చివరకు ఎవరిది తప్పు కాదని చేతులు దులిపేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో నాటి సంఘటన మరోసారి అసెంబ్లీ లో ప్రస్తావనకు వచ్చింది. 29 మంది చనిపోయినా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
దీనిపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ దీనిపై కేబినెట్ సబ్కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, జక్కంపూడి రాజా మాట్లాడుతూ డైరెక్టర్ బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు.? బోయపాటిని చంద్రబాబు షూటింగ్ చేయమన్నారా..? ఆయనే సినిమా షూటింగ్ చేశారా..? బోయపాటికి పుష్కరాలతో సంబంధం ఏంటన్న ప్రశ్నలతో టీడీపీ ఉక్కిరి బిక్కిరి అయ్యింది.