అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు పై దాడి చేసేందుకు వైకాపా కుట్రపన్నుతోందా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. వైకాపాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను రౌడీ మాదిరిగా తయారుచేసి తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, బి ఏ మధుసూదన్ రెడ్డి లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రౌడీల్లా తయారు చేశారని విరుచుకుపడ్డారు .అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు .
అధికార పార్టీ సభ్యులు సభలో చంద్రబాబును ఏకవచనంతో పిలూస్తూ విమర్శలకు దిగుతున్న , వాటిని టీవీలో చూపించడం లేదని అన్నారు . చంద్రబాబును ఇబ్బంది పెట్టడం ద్వారా వైకాపా నేతలు తెలుగు జాతిని అవమానిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి ముందుకు దూసుకు వెళితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వెనక్కి వెళ్తుందని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వంపై అపనమ్మకంతో ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరిస్తూ వెనక్కి వెళ్తున్నాయని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో విమర్శలు , ప్రతి విమర్శలు , ఆరోపణలు , ప్రత్యారోపణలు, చివరకు వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకున్న సంఘటనలు కూడా సహజమే కానీ ఇంతవరకు సభ్యులపై దాడులు జరిగిన సంఘటనలు అరుదనే చెప్పాలి .
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో కానీ , ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో ఈ తరహా ఘటనలు ఇంతవరకు చోటు చేసుకోలేదు . మరి బుద్ధా వెంకన్న మాత్రం చంద్రబాబు పై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు . ఆయన ఆరోపణల వెనుక ఏమైనా ఆధారాలున్నాయా ? అన్న ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు . దానికి బుద్ధా వెంకన్న ఏమి సమాధానం చెబుతారో చూడాలి మరి .