అనేక ట్విస్టుల‌తో సాగుతున్న క‌ర్ణాట‌క రాజకీయం సంకీర్ణ సర్కారు కుప్పుకూలిన త‌ర్వాత కూడా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. కర్నాటక రాజకీయంలో ఇవాళ మరో సంచలనం చోటుచేసుకుంది.  కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పనితీరుకు వ్యతిరేకంగా రెండు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో జ‌రిగిన ప‌రిణామాల్లో వారు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. తాజాగా ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై  స్పీకర్ రమేశ్‌కుమార్ అనర్హత వేటు వేశారు. 

 

స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్‌ కుమటహళ్లిలను అనర్హులుగా ప్రకటించారు. జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి కారణమైన 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అసలైన కారణాన్ని వెల్లడించలేదు. అయితే స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయం తర్వాత మిగిలినవారిపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్. శంకర్‌తో సహా ముగ్గురిపై 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు.

 

ఇటీవల జరిగిన విశ్వాస తీర్మానంలో కుమారస్వామి ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్‌ మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శంకర్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జూన్‌ లో గవర్నర్‌కు ఓ లేఖ అందజేయడమే కాకుండా..తన కేపీజేపీ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కేపీజేపీ విలీన ప్రక్రియకు జూన్‌ 25న స్పీకర్‌ ఆమోదం తెలపడంతో ఆర్‌.శంకర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: