మూడు తెలుగు చానల్స్ ను అసెంబ్లీ కవరేజ్ నుండి బహిష్కరించిన నిర్ణయాన్ని పున పరిశీలించనున్నట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జర్నలిస్టు సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం అసెంబ్లీ లోని ఆయన ఛాంబర్ లో జర్నలిస్టు సంఘాల నాయకులు స్పీకర్ తమ్మినేనిని కలసి బహిష్కరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. స్పీకర్ నిర్ణయం పై ఈ టీవీ, ఏబీఎన్, టీవీ5 మూడు తెలుగు చానల్స్ ఇప్పటికే వివరణ ఇచ్చిన విషయం తెల్సిందే . ఈ విషయాన్ని ఆయన దృష్టికి జర్నలిస్టు సంఘాల నాయకులు తీసుకువెళ్లారు .
ఈ విషయం పై క్షుణ్ణంగా జర్నలిస్టు సంఘాల నాయకులతో చర్చించిన స్పీకర్ సీతారాం బహిష్కరణ నిర్ణయాన్ని పున పరిశీలన చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ని కూడా జర్నలిస్టు సంఘాల నాయకులు కలసి ఈ విషయం పై మాట్లాడగా , అయన సానుకూలంగా స్పందించారు. ఛానెళ్ల పై బహిష్కరణ ఎత్తివేసేందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించడం పట్ల జర్నలిస్టు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు . మీడియాపై ఆంక్షలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయవని , అదే సమయం లో మీడియా కూడా సంయమనం పాటించాలని సూచించారు .
భవిష్యత్తు లో ఈ తరహా సంఘటనలు పునరావృత్తం కాకుండా మీడియా ఛానెళ్ల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని, అదే సమయంలో తమకు వ్యతిరేకంగా వార్త కథనాలు ప్రసారం చేస్తే చానెళ్లను బహిష్కరిస్తామని ధోరణి ప్రభుత్వం వీడనాడాలని జర్నలిస్టు సంఘాల నేతలు సూచించారు .