పేదలు, మధ్య తరగతి, ఆ మాటకొస్తే..అందరికీ పెద్ద ఉపశమనం కలిగించే వార్త ఇది. సామాన్యుల నడ్డి విరిస్తున్న పెట్రోలు, డీజీల ధరల విషయంలో గొప్ప ఉపశనం దక్కనుంది. సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తెచ్చే ప్రతిపాదన వేగవంతం అయింది. జీఎస్టీ పరిధిలోకి వీటిని తీసుకురావాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ కోరుతోంది. కొన్ని స్థానిక, రాష్ట్ర పన్నులనూ జీఎస్టీలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీఎస్టీ మండలికి ఓ మెమోరాండంను అసోచామ్ అందించింది. రెండు సంవత్సరపైగా జీఎస్టీలో కాకుండా పెట్రో ఉత్పత్తులపై వేరేగా పన్నులను వసూలు చేశారు. ఇకనైనా జీఎస్టీలో వీటిని కలుపాలి. విడిగా పన్నులు వేయడం వల్ల వ్యాపార నిర్వహణ ప్రభావితం అవుతున్నది అని సదరు మెమోరాండంలో మండలిని అసోచామ్ కోరింది.
అసోచామ్ కోరికకు కేంద్రం ఓకే చెపితే పెట్రోలు-డీజీల్ ధరలు తగ్గడం ఖాయం. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయంపై సహజంగానే ఉత్కంఠ ఉంది. ఇదిలాఉండగా, మండీ పన్ను, స్టాంప్ డ్యూటీ, రోడ్ ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్లనూ జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. సీజీఎస్టీ, ఐజీఎస్టీ క్రెడిట్ల పునర్వినియోగం, రెస్టారెంట్లు, రియల్టీలకు జీఎస్టీపై వెసులుబాటు అంతర్జాతీయ లావాదేవీలపై పన్ను లెవీపట్ల స్పష్టత, క్రమబద్ధీకరణలనూ మెమోరాండంలో అసోచామ్ ప్రస్తావించింది.
ఇదిలాఉండగా, ఈ-వెహికిల్స్పై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలన్న ఒకే ఒక్క ప్రతిపాదనపై జీఎస్టీ మండలి ఈసారి భేటీ కావాలని నిర్ణయించింది. విద్యుత్ ఆధారిత వాహనాలపై పన్ను రేట్లను తగ్గించే విషయమై గురువారం జరుగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 36వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ నిర్వహించాలనుకున్నారు. అయితే పార్లమెంట్లో దివాలా చట్టం సవరణల బిల్లుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించాల్సి రావడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాన్ని శనివారం నిర్వహించే అవకాశాలున్నాయి.