మాజీ మంత్రి భూమా
అఖిలప్రియకు సోదరులే షాక్ ఇచ్చారు. భూమా కుటుంబానికి చెందిన ఇద్దరు యువనేతలు బిజెపి
తీర్ధం తీసుకున్నారు. ఢిల్లీలో వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా సమక్షంలో కమలం
కండువాలు కప్పుకున్నారు. దాంతో అఖిలకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంది.
టిడిపి నుండి బయటకు వచ్చేసే విషయంలో భూమా కుటుంబంలో ఎప్పటి నుండో గోల జరుగుతోంది. చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం లేకే చాలామంది నేతలు బిజెపిలో చేరుతున్నారు. ఇందులో భాగంగానే అఖిల కూడా బిజెపిలో చేరాల్సింది. అయితే మాజీమంత్రి గొంతెమ్మ కోర్కెలు విని బిజెపి నేతలు ఆమె చేరికపై పెద్దగా ఆసక్తి చూపలేదు.
బిజెపిలో చేరాల్సిందిగా అఖిలను కమలం నేతలు సంపద్రించినపుడు తనకు రాజ్యసభ పదవి ఇస్తే బిజెపిలో చేరుతానని అఖిల షరతు విధించినట్లు సమాచారం. దాంతో అఖిలకు అంత సీన్ లేదని తేల్చేశారు. దాంతో అఖిలను కాదని ఆమె సోదరులు భూమా కిషోర్ రెడ్డి, భూమా మహేష్ రెడ్డిపై నాయకత్వం దృష్టి పెట్టింది. వాళ్ళ మధ్య చర్చలు ఫలించి చివరకు ఈరోజు సోదరులిద్దరూ బిజెపిలో చేరారు.
భూమా సోదరులు బిజెపిలో చేరటంతో అఖిలకు రాజకీయ శతృవులు పెరుగుతున్నారు. ఒకవైపు వైసిపిలోని గంగుల కుటుంబం, మరోవైపు తాజాగా బిజెపిలో చేరిన సోదరులు. వీళ్ళ కాకుండా పార్టీలోనే సీనియర్ నేతలు ఏవి సుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూఖ్ లాంటి నేతలతో కూడా ఫైట్ చేయాల్సిన పరిస్ధితి. మొత్తానికి అఖిలకు పెద్ద కష్టమే వచ్చిందని చెప్పుకోవాలి.