ఎవరైనా తిరుపతి వెళ్లాము అని చెబితే చాలు ముందు అడిగేది లడ్డూ గురించే. వెంకన్న లడ్డూ గురించి బహుశా తెలియని వారుండరు. అమోఘమైన ఈ లడ్డూ పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊరతాయి. దీని వాసన తాకినంతనే ఎప్పుడు తినేద్దామని మనసంతా పీకుతుంది. శ్రీవారికి అత్యంత ఇష్టమైన ఈ ప్రసాదాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టమైన లడ్డూ గురించి తెలియాలంటే ఓ 77 ఏళ్లు వెనక్కు వెళ్లాలి. 1803లో బూందీగా పరిచయమై, 1940 నాటికి లడ్డూగా మారి స్థిరపడింది. శ్రీవారి లడ్డూకు మేథో సంపత్తి హక్కులు ఉన్నాయి. ఏటా దీని కోసం రూ.200 కోట్లకు పైగా ఖర్చుచేస్తారు.

1940లో పరిచమైన లడ్డూ ప్రసాదం నేటికి 77 ఏళ్లు పూర్తిచేసుకుంది. పల్లవుల కాలం నుంచే కలియుగ దైవం ఆలయంలో ప్రసాదాలు వితరణ మొదలైనట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. క్రీ.శ 1445లో సుఖీయం, 1455లో అప్పం, 1460లో వడ, 1468లో అత్తిరసం, 1547లో మనోహర పడిలను ప్రవేశపెట్టారు. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాలు విక్రయాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రారంభమైన బూందీ చివరకు 1940 నాటికి లడ్డూగా స్థిరపడింది. లడ్డూ తయారీకి వినియోగించే సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా 1950లోధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు.


2001లో సవరించిన దిట్టాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5,100 లడ్డూల తయారీకి 165 కిలోల ఆవు నెయ్యి, 80 కిలోల శెనగపిండి, 400 కిలోల చక్కెర, 30 కిలోల జీడిపప్పు, 16 కిలోల ఎండు ద్రాక్ష, 8 కిలోల కలకండ, 4 కిలోల యాలకలు వినియోగిస్తారు. తొలి రోజుల్లో లడ్డూ పరిమాణం కల్యాణోత్సవం లడ్డూ అంత ఉండేది. ధర కూడా ఎనిమిదణాలే. ఆ తర్వాత రూ.2, రూ.5, రూ.10, రూ.15 ల నుంచి ప్రస్తుతం రూ.25కు చేరింది. ప్రస్తుతం రోజూ నాలుగు లక్షలకు పైగా లడ్డూలు తయారు చేస్తున్నా డిమాండ్ రెట్టింపు స్థాయిలోఉండటం గమనార్హం. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కల్యాణోత్సవం లడ్డూ, భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తారు.


దిట్టాన్ని టీటీడీ సక్రమంగా అమలు చేస్తూ, శాస్త్రీయ పద్ధతులను అమలు చేయడం వల్లే లడ్డూ రుచి ఏమాత్రం తగ్గడంలేదు. తిరుమలేశుని లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి అవసరమైన 16 వేల మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ ఏటా రూ.200 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేస్తోంది. ఇందులో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. పెరిగిన ధరలు, నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉండడంతో లడ్డూ ఆదాయం కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి. చెన్నయ్‌లోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం నుంచి ఆరేళ్ల కిందట టీటీడీకి లడ్డూపై మేథోసంపత్తి హక్కులు లభించాయి. దీని ప్రకారం ఎవరైనా దీన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తే శిక్షార్హులవుతారు


మరింత సమాచారం తెలుసుకోండి: