ఎన్నికలకు ముందు దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆయన మంత్రిగా చక్రం తిప్పారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా ఎనలేని గుర్తింపు సాధించారు. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాయకులపై ఆధిప త్యం చలాయించారు. ప్రభుత్వంలో తనే నెంబర్ 2గా చలామణి కూడా అయ్యారు. ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రిగా పీఠం ఎక్కిన ఆయనే నారా లోకేష్. ఉరఫ్ చిన్నబాబు.
అయితే, దొడ్డి దారిలో మంత్రి పదవి పొందారనే అప్పటి ప్రతి పక్షం వైసీపీ నేతల ఆరోపణల కారణంగా ఆయన పట్టుబట్టి ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఇక, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడ ఎలాంటి ప్రసంగం చేసినా.. కూడా నోరు విప్పితే.. ఏం మాట్లాడతారో తెలియని విధంగా వ్యవహరించారు. దీంతో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా గుర్తింపు సాధించారు.
తాను పోటీ చేస్తున్న మంగళగిరిని మందలగిరి అంటూ సంబోధించి.. తర్వాత కూడా సరి చేసుకోక పోవడంతో లోకేష్పై వైసీపీ నేతలు ఇప్పటికీ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అలాంటి నాయకుడు ఒక్క సారిగా ట్వీట్ల యుద్ధానికి దిగారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపైనా,జగన్పైనా కూడా ట్వీట్లతో విరుచుకుపడు తున్నారు. అది కూడా ఎప్పటికప్పుడు సమయానికి అనుకూలంగా స్పందిస్తూ.. కామెంట్లుకు మ్మరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై సందర్భానికి అనుకూలంగా ట్విట్టర్లో ``జగన్ గారూ`` అని గౌరవంగా పిలుస్తూనే.. విరుచు కుపడుతున్నారు. ప్రభుత్వానికి సవాళ్లు కూడా రువ్వుతున్నారు.
అయితే, నిన్న మొన్నటి వరకు మాటలే రాని చిన్నబాబు ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఏకంగా వ్యంగ్యాస్త్రాలతో ఎలా విరుచుకుపడుతున్నారబ్బా! అనే సందేహం సహజంగానే నెటిజన్లు వచ్చింది. దీనిలో లోతుపాతుల్లోకి వెళ్లి చూడగా.. టీడీపీ మీడియా విభాగం ఇంచార్జ్గా ఉన్న ఒక పెద్దాయనే లోకేష్ అవతారం ఎత్తి.. నిత్యం ట్వీట్ల యుద్ధం చేస్తున్నారని తెలిసింది. దీంతో అందరూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. మొత్తానికి చిన్నబాబు ట్వీట్ల యుద్ధం వెనుక కసరత్తు ఒకరిది.. పేరు మరొకరిది అన్నట్టుగా మారిపోయిందన్నమాట!