కొరియా కార్ల తయారీ
కంపెనీ ’కియా’ తయారు చేసిన మొదటి
కారును జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. కియాను అనంతపురం జిల్లాలోని పెనుకొండ
నియోజకవర్గానికి తెచ్చింది ఎవరు అన్న విషయంలో ఒకవైపు రాజకీయంగా దుమారం రేగుతున్న
విషయం తెలిసిందే. ఆ వివాదం అలా ఉండగానే పెనుకొండ ప్లాంట్ లోనే ఉత్పత్తయిన మొదటి
కారును మాత్రం జగన్ విడుదల చేయటం ఖాయమైపోయింది.
ఈనెల 8వ తేదీన జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆ సందర్భంగా కియా కార్ల ఉత్పత్తిప్లాంటుకు వెళ్ళి మొదటికారును రోడ్డుపైకి తీసుకొస్తారు. కియా ఉత్పత్తి చేసిన కారును చంద్రబాబు రిలీజ్ చేస్తారని గతంలో కూడా ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్లుగానే మొదటికారును చంద్రబాబు రోడ్డుపైకి తెచ్చారు. అయితే చంద్రబాబు నడిపిన మొదటి కారు పెనుకొండ ఉత్పత్తి ప్లాంటులో తయారైన కారు కాదు.
పెనుకొండలో ఉత్పత్తయిన మొదటి కారు అంటూ అప్పట్లో బాగా ప్రభుత్వం ఊదరొట్టింది. అయితే చంద్రబాబు రిలీజ్ చేసిన కారు ధక్షణి కొరియాలో అసెంబుల్ చేయించి పెనుకొండకు తెప్పించిన 10 కార్లలో ఒకటి మాత్రమే. ఆ విషయం బయటపడటంతో అప్పట్లో చంద్రబాబు పరువు బజారున పడింది. అందుకే తర్వాతెప్పుడూ ఆ విషయాన్ని టిడిపి మాట్లాడలేదు.
కానీ జగన్ విడుదల చేయబోయే కారుమాత్రం పెనుకొండ ప్లాంటులో ఉత్పత్తయినదే అని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ చెబుతున్నారు. కలెక్టర్ చెబుతున్నారు కాబట్టి నిజమే అయ్యుండచ్చు. ఏదేమైనా కియా ఉత్పత్తి చేసిన మొదటికారును జగన్ రిలీజ్ చేయటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
కియా కార్ల ఉత్పత్తి ప్లాంటు కోసం చంద్రబాబు కూడా కష్టపడిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ కూడా టిడిపి నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారు. అందుకనే ప్లాంటు నెలకొల్పిన పెనుకొండలో కూడా టిడిపి ఓడిపోయింది. ఎలాగూ కియా ప్లాంట్ కు వెళతారు కాబట్టి స్ధానికులకే ఉద్యోగాలిచ్చే విషయాన్ని జగన్ యాజమాన్యంతో మాట్లాడితే బాగుంటుంది.