కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాగైనా రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో... తెలంగాణలో బీజేపీకాస్త బలంగానే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పెద్దగా బలం లేదు. ఇది పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే అంశమని చెప్పాలి. అందుకే అక్కడ బలపడేందుకు పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలను బీజేపీలోకి తీసుకొంటోంది. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
చాలామంది నేతలు జంప్ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో కొందరు జంప్ అయ్యే అవకాశం ఉంది. అటు తెలంగాణాలో కూడా అధికారంలో ఉన్న నేతలకు గాలం వేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నది. కర్ణాటక తరహా రాజకీయాలను మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితె.. చాలా పార్టీలు దెబ్బతింటాయి. ప్రాంతీయ పార్టీల మనుగడ ఇబ్బందికరంగా మారుతుంది.
ఇప్పటి వరకు తెలంగాణలో సెంటిమెంట్ తో కెసిఆర్ పార్టీని లాక్కొస్తున్నారు. సెంటిమెంట్ ప్రతీసారి వర్కౌట్ కాదు. ఏ పార్టీ అయినా అక్కడ అభివృద్ధి చేస్తేనే మనుగడలో ఉంటుంది. బీజేపీ ఇప్పుడు ఇదే అంజెండాను పట్టుకొని రాష్ట్రాల్లో పరుగులు తీస్తోంది. అభివృద్ధి తో పాటు హిందుత్వవాదాన్ని తెరమీదకు తీసుకొస్తోంది పార్టీ. అభివృద్ధి, హిందుత్వవాదం ఈ రెండు పార్టీకి బలంగా మారాయి.
తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు సిద్ధం అవుతున్నారు. బీజేపీ ని అడ్డుకోవడానికి పధకాలు రచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం, ఇచ్చిన హామీలను నెరవేర్చిడం వంటి వాటిని కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచుగా కలిసి అభివృద్ధి కోసం ఎలాంటి పధకాలు అమలు చేయాలి, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి తదితర అంశాలపై చర్చించినందుకు తరుచుకలుస్తున్నారు. బీజేపీకి చెక్ పెట్టె అంశాలను కూడా వీరి చర్చల్లో ప్రధానంగా ఉన్న ఒక అంశం అని తెలుస్తోంది.