తొందరలో వైసిపికి
ఎంఎల్సీల కొరత కొంత వరకూ తీరనున్నది. 58 మంది సభ్యులున్న శాసనమండలిలో వైసిపి సంఖ్య
చాలా తక్కువనే చెప్పాలి. గడచిన ఐదేళ్ళల్లో ఎంఎల్ఏల సంఖ్య కారణంగా, అధికారంలో ఉన్న
కారణంగా టిడిపికి శాసనమండలిలో మెజారిటి ఉంది. మొత్తం సభ్యుల బలంలో టిడిపి సభ్యులే
34 మందున్నారు. ఈ కారణంగానే మండలిలో ఏ చర్చ జరిగినా టిడిపి వాదనే బలంగా
వినిపిస్తోంది.
అయితే ఆ కొరత నుండి కొంత వరకూ వైసిపి బయటపడబోతోంది. తొందరలో ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వబోయే మూడు స్ధానాలూ ఈనెల 26వ తేదీన అధికార పార్టీకి దక్కబోతోంది. శాసనమండలిలో ప్రస్తుత బలాబలాల ప్రకారమైతే టిడిపికి 34 మంది సభ్యులున్నారు. వైసిపి బలం 6, పిడిఎఫ్ సభ్యుల బలం 5, ఇద్దరు స్వతంత్రులున్నారు. . వివిధ కారణాలతో 11 స్ధానాలు ఖాళీగా ఉన్నాయి.
వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 11 స్ధానాల్లో ఐదు సీట్లు స్ధానిక సంస్ధల ద్వారా, గవర్నర్ నియామకం ద్వారా భర్తీ అయిన క్యాటగిరిలు ఉన్నాయి. ఇందులోని ఓ ఐదు స్ధానాలు స్ధానిక సంస్ధల ద్వారా భర్తీ అయినవే. ఎంఎల్సీలుగా ఉన్న నేతలు మొన్నటి ఎన్నికల్లో ఎంపిలుగా, ఎంఎల్ఏలుగాను ఎన్నికయ్యారు. అలాగే ఓ టిడిపి ఎంఎల్సీ రాజీనామా చేశారు
టిడిపి ఎంఎల్సీ అయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి మొన్నటి ఎన్నికలో వైసిపి ఎంపిగా గెలిచారు. అలాగే టిడిపి ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ ఎంఎల్ఏగా గెలిచారు. టిడిపి ఎంఎల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు ఎన్నికలకు ముందే రాజీనామా చేశారు. టిడిపి ఘోర ఓటమి తర్వాత అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా చేశారు.
అంటే ఈనెల ఎన్నిక జరిగే మూడు స్ధానాలతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగిన వెంటనే మరో ఐదు కూడా వైసిపికే దక్కబోతోంది. ఆ తర్వాత దశలవారీగా ఎలాగూ వైసిపి బలం పెరుగుతుందనుకోండి అది వేరే సంగతి. అంటే తొందరలోనే కౌన్సిల్లో వైసిపి బలం 6 నుండి 14 కి పెరగటం ఖాయమనే అనిపిస్తోంది.