ఆ వూరి రాజు పక్కూర్లో సామాన్యుడు. ఇది అందరికీ తెలిసిన అతి సామాన్యమైన సామెత. చంద్రబాబు నాయుడు అంటే ఏపీకి మాజీ  ముఖ్యమంత్రి కానీ ఆయన విదేశాల్లో భారత పౌరుడే. ఇక బాబు ఒక దేశం విడిచి మరో చోటకు వెళ్లినపుడు ఆయనలోని కామన్ మాన్ ఒక్కసారిగా బయటకు వచ్చేశాడు. తాజాగా అమెరికా టూర్లో బాబు ఫక్త్ సగటు మనిషి అవతారం ఎత్తారు. ఆయనలోకి సీరియస్ పొలిటీషియన్ మాయమయ్యాడు. హుషార్ గా  నలుగురుతో పాటు తిరిగే సరదా బాబుగా మారిపోయారు. 


సోషల్ మీడియాలో బాబు అమెరికా షికార్లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అక్కడ వీధుల్లో ఆయన కలియతిరుగుతూ పాప్ కార్న్ తినడం, అందరిలాగానే తిరుగుతూ ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా వీడియో గా వచ్చేశాయి. వాటిని చూస్తున్న తెలుగు తమ్ముళ్లు మా బాబు బంగారం అనుకుంటున్నారుట. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన గత నెల 28న అమెరికా వెళ్ళారు. ఆయన మెడికల్ చెకప్ కోసం అక్కడికి వెళ్ళినట్లుగా తెలిసింది. అది కూడా రెగ్యులర్ చెకప్ అంటున్నారు. సో అదేమంత పెద్ద విషయం కాదు.


ఇక ఆ తరువాత అమెరికాలో చంద్రబాబు సాధారణ విహారిగా మారిపోయారు. భార్య భువనేశ్వరితో ఆయన అక్కడి రెస్టారెంట్లలో కాఫీ సిప్ చేస్తూ కనిపించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అదే విధంగా ఆయన సాధారణ వ్యక్తుల మాదిరిగానే రెస్టారెంట్ లోనే లంచ్ కానిచ్చేయడం, నలుగురితోనూ టేబిల్స్ షేర్ చేసుకోవడం కనిపించింది. ఇక చంద్రబాబు అమెరికా వీధుల్లోనూ చక్కర్లు కొడుతూ భలే  సరదా చేశారు.  ఆయన వెంట తానా సభ్యులు కొందరు ఉన్నారు.


కాగా,  బాబు ఇంతకు ముందు కూడా అమెరికా  ఎన్నో సార్లు వెళ్లారు, కానీ ఇలా ఎపుడు ఆయన జాలీగా గడపలేదని తమ్ముళ్ళే అంటున్నారు. చంద్రబాబు ఇలా హుషార్ చేయడం టీడీపీ తమ్ముళ్లకు కూడా తెగ ఆనందంగా ఉందిట. తమ నేతలో కొత్త కోణాన్ని చూస్తున్నామని, ఆయన స్మైలింగ్ ఫేస్ ని చూస్తున్నామని అంటున్నారు. ఎపుడు తాను నిద్రపోకుండా అందరినీ నిద్రపోనీయకుండా చంద్రబాబు వ్యవహరించేవారని, ఇపుడు ఆయన్లో కూడా కామన్ మాన్ బయటకు రావడం మంచి విషయమని అంటున్నారు. మొత్తానికి పాప్ కార్న్ తింటూ బాబు అమెరికాలో చేసిన సందడి టీడీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: