తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో టాప్ హీరోస్ సరసన నటించి మెప్పించింది విజయశాంతి. ఆ తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించినంది. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో విజయశాంతిని లేడీ అమితాబ్ గా పిలిచేవారు. ఇక ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించడం ఆమెకు అచ్చిరాలేదు..దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదట ఆమె బీజేపీ పార్టీలో చేరి అందరి మన్ననలు పొందింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో బీజేపికి తన వంతు ప్రచారం చేసి పెద్దల మెప్పు పొందింది. అయితే బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ వీడింది. అదే సమయంలో తెలంగాణ పోరాటం ఉధృతమవుతున్న సమయంలో తల్లితెలంగాణ పార్టీ పెట్టింది..తర్వాత టీఆర్ఎస్ లో విలీనం చేసింది. ఈ క్రమంలో ఆమె టీఆర్ఎస్ తరుపు నుంచి మెదక్ ఎంపిగా పోటీ చేసి గెలిచారు. ఇలా రాజకీయ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎంగా కేసీఆర్ ఎన్నుకోబడ్డారు..అయితే ఆ సమయంలో తనకు సరైన ప్రాధాన్యత టీఆర్ఎస్ లో దక్కలేదని ఆ పార్టీ వీడారు విజయశాంతి. తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆమె ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ తరుపు నుంచి విపరీతంగా ప్రచారం చేశారు. కానీ తెలంగాణాలో మహాకూటమి ఘోరంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ సత్తా చాటుకుంటుంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు, కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న ఆమె.. త్వరలో ఆ పార్టీకి గుడ్బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ నేతల తీరుతో ఆమెకు విసుగువచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు కొంత కాలంగా టీకాంగ్రెస్ లో అంతఃకలహాలు ఎక్కువ అయ్యాయని బాహాటంగానే చెప్పింది విజయశాంతి. త్వరలో విజయశాంతి కేంద్రమంత్రి అమిత్షాను ఆమె కలవనున్నారని తెలుస్తోంది. బీజేపీ నాయకులు ఆమెతో రెండు సార్లు సంప్రదింపులు జరిపారని కూడా టాక్. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది విజయశాంతి.