'' నిజానికి ఆహారానికి కులముందా, భోజనానికీ కులముందా అనే ప్రశ్న అడిగేవాళ్ల ఇంటిగ్రిటీ మీదే నాకు సందేహాలున్నాయి. వాళ్లు తమ చుట్టూ జరుగుతున్నసంఘటనల లోతుపాతులు గమనించలేని వారైనా అయుండాలి లేదూఈ ప్రశ్న అడగడం ద్వారా తమను తాము సెక్యులర్ కిరీటధారులుగా ప్రదర్శించుకునే నాటకం ఆడే వారైనా అయి ఉండాలి....'' అని కుండబద్దలు కొట్టారు, ప్రముఖ జర్నలిస్టు,సామాజిక విశ్లేషకుడు,రచయిత ప్రసేన్‌...

''ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన ఆహారాన్ని తిప్పిపంపిన ఉధంతం పై '' ప్రసేన్‌ తనదైన సామాజిక కోణంలో స్సందించారు.. చదవండి..


'' తిండికి కులముందని మనందరికీ తెలుసు. భోజనానికి మతముందనీ మనందరికీ తెలుసు. అయితే మనకు తెలుసనే విషయం మాత్రం మనకు తెలియదు. లేదూ తెలుసనే విషయం అంగీకరించకపోవడమేసౌలభ్యం కనుక తెలియనట్టుండడమే సుఖం. చాలా విషయాలను మనం మన ప్రాంతం లోకి మన ఊరిలోకి మన వీధి చివరకు మన వాకిట్లోకి మన పడగ్గదిలోకి వచ్చేంత వరకూ అధ్యయనం చేయం.తీరా అది మన పక్కలో పడుకుని పీకమీద కత్తిగా మారాక అప్పుడు అయ్యో అని కళ్లు తెరుస్తాం లేదూ అప్పుడే తెలిసినట్టు నటించిఇంటెలెక్చువల్ ఆహార్యం తొడిగేసుకుంటాం.


భోజనానికి కులమో మతమో లేదని నమ్మే సమాజంలోనే మనమున్నామా. హిందూ మతంలోని కొన్ని కులాల వాళ్లుమాంసం తినరు. మాంసం తినే కొందరు హిందువులు కూడా పంది మాంసం తింటారు. హిందువులలో ఇంకో వర్గం గొడ్డుమాంసాన్నీ తింటారు.ముస్లింలు హలాల్ చేసిన మాంసం మాత్రమే తింటారు. సిక్కులు హలాల్ చేసిన మాంసాన్ని తినరు. బుద్దిజంలోఒక వర్గం పోర్క్, చికెన్, మాంసం కేవలం తినడం కోసం ఆయా జంతువులను చంపితే తినరు. చనిపోయిన జీవుల మాంసాన్నిమాత్రమే తినొచ్చు. జైనులు పూర్తి అహింసావాదులు. మాంసం సంగతి దేవుడెరుగు వేరు కూరగాయలు అంటే దుంపలు, ఆలుగడ్డలుకంద గడ్డలు లాంటివి కూడా తినరు. వేళ్లకు పండే కూరగాయలు తినడం అంటే చెట్టు మొత్తాన్నీ ధ్వంసం చేయడం కనుక దాన్ని కూడావారు హత్యగానే భావిస్తారు. కొన్ని రోజులలో జైనులు అసలు ఆకుపచ్చటి ఆహారం తినడాన్నే పాపంగా భావిస్తారు. యూధులు ఫలానావిధంగా వేళ్లాడ దీసి ఫలానా రకంగా కోసిన జంతుమాంసం మాత్రమే తింటారు. ఇవన్నీ ఆహారానికి మతం ఉండడమా లేక మతానికి ప్రత్యేకమైన ఆహారం ఉండడమా.


సరే ఇంత సాహిత్య చర్చ వద్దనుకుని మరీ నేలబారుకొచ్చి మాట్టాడుకుందాం...మధ్యాహ్న భోజనం వండేది తక్కువ కులం వాళ్లయినందువల్ల తమ పిల్లలు ఆ భోజనం తిని మైలపడతారని అగ్రకులాల తల్లిదండ్రులు తమ పిల్లలకు బాక్సులు కట్టిచ్చిన ఉదాహరణలు మనకు తెలియదా, దద్దోజనం పులిహోరపరవాన్నం గారెలు అనే ఆహారాన్ని ప్రసాదం పేరుతో క్రైస్తవులకు పంపండి వాళ్లు దాన్ని ముట్టను కూడా ముట్టరు... అప్పుడా తిండికిమతం ఉన్నట్టా లేనట్టా. కొన్ని కులాలవారు తద్దినం భోజనాలకు రారు. బ్రాహ్మణ భోజన హోటల్ అని బోర్డు వెజిటేరియన్ హోటల్ కు ఉన్నపుడు ఆ భోజనానికి కులం ఉన్నట్టా లేనట్టా, హోటల్ కు వచ్చివండేది ఎవరో ఏమో అని సందేహించి ఆ పూటకు తినకుండా పస్తున్న అగ్రకుల మహానుభావులు నాకు చాలామంది తెలుసు. ఏ కులానికి ఆ కులంవనభోజనాలు నిర్వహించుకున్నపుడు ఆయా భోజనాలకు కులం ఉన్నట్టా లేనట్టా.


రెండు గ్లాసుల సంస్క్రుతిలోంచి పుట్టినవాళ్లం మనం. ఇప్పటికీ పనిమనుషులకు వేరే గ్లాసులు వేరే కంచాలు ప్రత్యేకంగా ఉంచేభావజాలం మధ్యలో ఉన్నవాళ్లం మనం. పరువు హత్యలను గర్వంగా కులంకోసం చేసి కాలరెగరేసే మురికి పరిమళాన్ని శ్వాసిస్తున్న వాళ్లం.మనవాళ్లే, మనోడే, మన తెగే, మన జాతే అనే మాటలను వినకుండా రోజు గడపలేని జాతి మనం.


ఇదంతా ఆహారానికి కులం వుందా మతం వుందా అని ప్రశ్న అడిగిన వాళ్లకు తెలియని సమాధానమేమీ కాదు. అంతా తెలిసిందే. అంతా మనమే. అంతా మనదే.అంతా మనలోపలిదే. చంపాల్సింది దాన్ని. ప్రశ్నించాల్సింది దాన్ని. అది కూడా మనకు తెలియని సమాధానమేమీ చెప్పదు. మనకు తెలిసిన ఆ సమాధానాన్నిమనం కొంచెం ముసుగులు తీసి అరిచి ప్రపంచానికి వినిపించగలగాలంతే. అలా చేయలేని నాడు వాడెవడో ఆన్లైన్ ఆహారాన్ని తిప్పి పంపాడే వాడికంటే మనం గొప్ప జంతువులమేమీ కాదు.''


మరింత సమాచారం తెలుసుకోండి: