రాష్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మహల్ లాంటి ప్రగతి భవన్ బయటకు రావాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ సభాపక్ష నాయకులు భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డితో నిలోఫర్ ఆస్పత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిని పరశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మహాల్ నుంచి బయటకు వచ్చిసెక్రటేరియట్ లో కూర్చోవాలన్నారు. అప్పుడే తెలంగాణ ప్రజల కన్న కలలు నెరవేరతాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు దవాఖానల్లో వైద్యం అంగడిలో వస్తువుగా మారిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సకాలంలో వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రసిద్ధి చెందిన నీలోఫర్ , గాంధీ, ఉస్మానియా. నిమ్స్ వంటి ఆసుపత్రిలో వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక జిల్లా కేంద్రాల్లోని, ఏరియా, డిస్పెన్సరీలు పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందన్నారు. వైద్యులు, సిబ్బంది, టెక్నీషియన్ల కొరతతో రోగులకు అరకొరగా సేవలందిస్తున్నారని అన్నారు. అంతెందుకు తన నియోజకవర్గ మైన మధిరలోని ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ కుప్పకూలిపోయోన పరిస్థితి అన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన వైద్య మంత్రి తన నియోజకవర్గానికి పరిమితమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పుత్రులకు దుస్థితికి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో
వైద్యశాఖపై సమీక్ష నిర్వహించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నీలోఫర్ హాస్పిటల్ అనేది హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు తలమానికంగా ఉండేదని భట్టి అన్నారు. అలాంటి ఆసుపత్రిని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని చెప్పారు. కానీ నీలోఫర్ లో అందుతున్న వైద్య సేవలను చూస్తే ఎవరికైనా కూడా కన్నీళ్లు రాకమానవన్నారు. ఎమర్జెన్సీ వార్డ్ లో ముగ్గులు ముగ్గురు పేషెంట్లు బెడ్ మీద పెట్టి వైద్యం చేస్తున్నారు. చివరికి సరైన ఆక్సిజన్ కూడా లేకుండా వైద్యులు సేవలందించేందుకు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర నిధులు పేద ప్రజలకి ఆరోగ్యం వైద్యం అందుబాటులో రావాలని భట్టి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రుల చుట్టూ తిప్పాలని సిఎం సూచించారు.అవసరాలకు నిధులను విడుదల చేయాలన్నారు.
జీతాలు పెంచాలని కోరుతున్న వైద్య సిబ్బంది విషయంలో ప్రభుత్వం ఉదారతను ప్రదర్శించాలన్నారు. దయచేసి ఈ విషయంలో వెంటనే కేసీఆర్ స్పందించాలని కోరారు. అదే విధంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వ వాటా వచ్చే పరిస్థితి లేదన్నారు. దీంతో ప్రభుత్వం ఒక మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా గాలికి వదిలిందని భట్టి మండిపడ్డారు.