అందాలకు అందాలను రాశులుపోసినట్టుగా ఉండే ప్రాంతం కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ లోని లోయలు, పర్వత ప్రాంతాలతో అందంగా తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. ఈ కాలంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని ప్రజలు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అమర్నాథ్ యాత్ర ఈ సమయంలోనే జరుగుతుంది. అక్కడి ఎన్నో ప్రముఖ దేవాలయాలకు భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. అయితే, పక్కనే ఉన్న పాక్ నుంచి ఉగ్రముప్పు పొంచి ఉంటుంది. అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కాసుకొని కూర్చున్నారు. ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని సమాచారం అందటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
యాత్రను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కాశ్మీర్ ను యాత్రికులు వదిలి వెళ్లాలని ఆదేశాలు జరీ చేసింది. విద్యార్థులు వసతి గృహాలను ఖాళీచేయాలని, కార్గిల్ ఉద్యోగులు అందుబాటులో ఉండాలని, హాస్పిటల్, అత్యవసర చికిత్సలను ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేసింది ప్రభుత్వం. దీంతో పాటు కాశ్మీర్ కు అదనపు బలగాలను పంపడంతో కాశ్మీర్ లో ఏం జరగబోతుందో అర్ధం కావడం లేదు. పైగా, ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాశ్మీర్ పై కీలక ప్రకటనలు చేశారు. అవసరం అనుకుంటే కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడంతో అనుమానాలకు దారిస్తోంది.
కాశ్మీర్ విషయం ఇండియా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాశ్మీర్ ను మూడు భాగాలుగా చేసి.. జమ్మూ ను ప్రత్యేక రాష్ట్రంగా, కాశ్మీర్, లడక్ లను రెండు రాష్ట్రాలుగా విభజించి కాశ్మిర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసి కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోందని ఊహాగానాలు వస్తున్నాయి.
దీంతో పాటు, 1948 లో పాక్ ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని తిరిగి సొంతం చేసుకోవడానికి ఇండియా ప్రయత్నాలు మొదలుపెటిందని, ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికాకు తెలియజేసిందని, అగ్రరాజ్యం నుంచి సానుకూల స్పందన రావడంతో.. ఇండియా ఈ చర్యకు పూనుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. పీవోకే లో ఉన్న భూభాగం తిరిగి ఇండియా వశం అవుతుంది. ఉగ్రవాదుల ముప్పు నుంచి ఇండియా శాశ్వతంగా బయటపడుతుంది. అటు చైనా ప్రాబల్యం కూడా తగ్గిపోతుంది. అందుకే ఇండియా తమ సైన్యాన్ని ఆ భాగంలో మోహరిస్తోందని వార్తలు వస్తున్నాయి.