హర్షకుమార్. ఎస్సీ నాయకుడిగానే కాకుండా కాంగ్రెస్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తూర్పుగో దావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన కుమార్.. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుల్లో ఒకరుగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆయన సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు కూడా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన ఆ వెంటనే మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరి.. పోటీ చేశారు కూడా.
అయితే, 2014లో ప్రజలు చంద్రబాబు వెంటే నడవడంతో ఆయన ఓడిపోయారు. ఆతర్వాత చాన్నాళ్లపాటు పార్టీలకు, రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇక, ఎన్నికలకు రెండు సంవత్సరాల నుంచి తరచుగా మీడియా ముందుకు వచ్చిన హర్షకుమార్.. చంద్రబాబు కు అనుకూలంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలన భేష్ అంటూ కితాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇక, చంద్రబాబు కూడా మాజీ నేతలకు ఆహ్వానం పలకాలని నిర్ణయించుకున్నారు.
అయితే, అదేసమయంలో వైసీపీ నుంచి కూడా హర్షకుమార్కు ఆహ్వానం అందినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఆయన మాత్రం టీడీపీకి అనుకూలంగానే ఉండడం గమనార్హం. ఇంతలోనే ఎన్నికల సమయానికి చంద్రబాబు సర్వే చేయించారు. ఈ సర్వేలో హర్షకుమార్ బదులు.. మాజీ స్పీకర్, దివంగత బాలయోగి కుమారుడు అయితే బెటరని, సింపతీ కూడా ఉంటుందని ఆయన సర్వేలు అందాయి. దీంతో చివరి నిముషంలో హర్షకుమార్ టీడీపీ ఎంట్రీ ఆగిపోయింది. అదే సమయంలో ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా. అప్పటికే ఆలస్యం కావడం, టికెట్లు కూడా ప్రకటించడంతో మౌనం వహించారు. ఇక, ఎన్నికల్లో ఇక్కడ ఆయన తటస్థంగానే వ్యవహరించారు.
పోటీ చేయాలని, గెలవాలని భావించినా.. టికెట్, పార్టీ విషయంలో సరైన సమయంలో స్పందించని, నిర్ణయం తీసుకోని కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం రాజకీయ సన్యాసం దిశగానే అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఆయనకు ఏ పార్టీ కూడా ఆహ్వానం పలికే పరిస్థితి ఇప్పటికైతే కనిపించడం లేదు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.