ఇటీవల ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సినీనటుల్లో చాలా మంది టీడీపీకే సపోర్ట్ చేశారు. టీడీపీకి చాలా మంది టాలీవుడ్ పెద్దలు ముందునుంచి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి వచ్చి టీడీపీ స్థాపించడం, ఇక ఇండస్ట్రీలో కమ్మ వర్గం వాళ్లు ఎక్కువుగా ఉండడంతో సహజంగానే వాళ్లంతా టీడీపీయే గెలవాలని కోరుకున్నారు.
అయితే కొందరు మాత్రమే డేరింగ్గా వైసీపీకి సపోర్ట్ చేశారు. వీరిలో పృథ్వి ఒకరు. ఆయన చాలా డేరింగ్గా వైసీపీకి ప్రచారం చేయడంతో పాటు టీడీపీ, చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక పృథ్వితో పాటు పోసాని కృష్ణమురళి, ఆలీ, జీవితా రాజశేఖర్ దంపతులు కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్గా పృథ్వీని నియమించారు.
ఆ తర్వాత పృథ్వి సినిమా వాళ్లకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని..అందుకే ఎవ్వరూ ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదని.. ఇక నుంచి సినిమా వాళ్లకు ఓట్లేయలేదని చెప్పారు. ఆ తర్వాత ప్రెస్మీట్ పెట్టిన పోసాని పృథ్వి మాటలను ఖండించారు. సురేష్బాబు లాంటి నిర్మాతలు జగన్ అపాయింట్మెంట్ తీసుకున్నారని.. జగన్ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉండడంతో కుదర్లేదని తర్వాత కలుస్తారని చెప్పారు.
ఇక ఇప్పుడు పృథ్వి ఆదివారం ఇదే అంశంపై ప్రెస్మీట్ పెట్టారు. తాను కలలో కూడా ఇలాంటి పదవి వస్తుందని అనుకోలేదని ఆయన చెప్పారు. తనకు వైసీపీ రాజకీయంగా జన్మనిచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు కోసం పనిచేస్తానని చెప్పారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలని ఎన్నో మొక్కులు మొక్కుకున్నానని, తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, అమరావతిలోనే రాజకీయాలు మాట్లాడతానని చెప్పారు.
ఇక గతంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తూనే ఉంటానని... నెలలో 20 రోజులు తిరుపతిలో ఉంటానని తెలిపారు. ఇక తనపై పోసాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మా ఇద్దరికి ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు.