ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల5 వ తేదీన జగన్ తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు. ఈ పర్యటన లో ఆయన అనేక అంశాలపైన అధ్యారనం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా
ఆదివారం ఇజ్రాయెల్లోని హదెరా నీటిశుద్ధి ప్లాంట్ను సందర్శించారు. సిఎం వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం(ఇజ్రాయెల్) పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన పలు క్రైస్తవ పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకున్నారు. అంతే వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు. అక్కడి ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ గురించి ఈ సందర్భంగా ప్లాంట్ అధికారులు సీఎం జగన్కు వివరించారు. ప్రాజెక్టు వ్యయం, నిర్వహణా వ్యయాల గురించి సీఎం అక్కడి అధికారులను ఆరా తీశారు. ప్లాంట్లో వివిధ విభాగాలను పరిశీలించిన సీఎం ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియలో పలు దశల గురించి అడిగి తెలుసుకున్నారు.
నీటిశుద్ధి ప్లాంట్ యంత్రాల పనితీరును పరిశీలించి ప్లాంట్లో మంచినీటిని రుచి చూసిన ముఖ్యమంత్రి నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ప్రశంసించారు. టెల్అవీవ్లో బారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ సీఎం వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా ఇజ్రాయెల్ రైతులతో సమావేశమయ్యారు.ఎడారిలో ఉన్నప్పటికీ తక్కువ నీటితో భారీ స్థాయిలో దిగుబడిని సాధిస్తోంది. ఈ సందర్భంగా తక్కువ నీటితో అత్యధిక దిగుబడి సాధించే దిశగా అనుసరిస్తున్న పద్ధతులను ఇజ్రాయెల్ రైతులను అడిగి తెలుసుకున్నారు. నీటి పొదుపు, పునర్వినియోగం విషయంలోఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.
ఇజ్రాయిల్ తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్కు చెందిన ఆర్మూర్ వాసులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో తన కొడుకుకు వైఎస్సార్ అని నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి వేటలో తాము ఇజ్రాయిల్ వచ్చినా ప్రతీ ఏటా తమ ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్న తీరును జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో అంకాపూర్ తిరుపతిగౌడ్, ప్రశాంత్, కలిగోట్ చరణ్గౌడ్ తదితరులున్నారు.